తెలంగాణ మంత్రికి చేదు అనుభవం.. వివాహ వేడుకలో ఊహించని షాక్..
తెలంగాణ ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు ఊహించని షాక్ తగిలింది. గురువారం సాయంత్రం మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో ఓ వివాహ వేడుకకు శ్రీనివాస్ గౌడ్ హాజరుకాగా.. ఆయన కుడిచేతి బంగారు కడియాన్ని ఎవరో తస్కరించారు. వివాహ వేడుకలో చాలామంది మంత్రితో సెల్ఫీలకు పోటీపడగా.. కాదనలేక ఆయన అందరితో సెల్ఫీలు దిగారు. తీరా సెల్ఫీ తతంగం అయ్యాక చూసుకుంటే.. చేతికి ఉండే కడియం మాయమైంది. దీంతో ఎంత పనైపోయింది అని మంత్రి నిట్టూర్చినట్టు సమాచారం.
ఆ కడియాన్ని శ్రీనివాస్ గౌడ్ సెంటిమెంటుగా భావిస్తారని అనుచరులు చెబుతున్నారు. అందుకే అక్కడే ఉన్న పోలీసులు,గన్మెన్లపై ఆయన ఫైర్ అయినట్టు తెలుస్తోంది. తన కడియాన్ని దొంగిలించిందెవరో గుర్తించి.. తిరిగి తీసుకురావాలని వారిని ఆదేశించినట్టు సమాచారం. మంత్రి ఆగ్రహంతో పోలీసులు.. పెళ్లి వేడుకకు వచ్చినవారిని కడియం గురించి ఆరా తీసినట్టు చెబుతున్నారు. ఎవరైనా కడియం తస్కరించి ఉంటే.. తిరిగి ఇచ్చేయాలని అక్కడికి వచ్చినవారికి విజ్ఞప్తి చేశారట. మొత్తం మీద పెళ్లి వేడుక కోసం వెళ్లిన శ్రీనివాస్ గౌడ్కు అనుకోని చేదు అనుభవం ఎదురైంది.
Recommended Video
కాగా, ఇటీవలే మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో మాతా శిశు సేవల భవనాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోనే మొట్టమొదటి మెడికల్ కళశాలను మహబూబ్ నగర్ కు తీసుకురావడానికి ఎంతగానో శ్రమించామని ఈ సందర్భంగా చెప్పారు. ప్రస్తుతం ఉన్న కలెక్టర్ భవనం హెరిటేజ్ బిల్డింగ్ కాబట్టి అందులో యథావిథిగా ఆస్పత్రి సేవాల్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు.దీనివల్ల ఎంతోమందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ఒకప్పుడు నెలకు 100 ప్రసవాలు కూడా జరిగేవి కావని... ఇప్పుడు ప్రసవాల శాతం గణనీయంగా పెరిగిందన్నారు. మహబూబ్ నగర్ మెడికల్ కళాశాల రాష్ట్రంలోనే మూడో స్థానంలో ఉండటం సంతోషకరమన్నారు. జనరల్ ఆస్పత్రిని కార్పొరేట్ ఆస్పత్రికి ధీటుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.