మంత్రి ఈటలకు బీజేపీ సపోర్ట్.. కామెంట్లపై కేసీఆర్, కేటీఆర్ వివరణ ఇవ్వాలని డిమాండ్
హైదరాబాద్ : మంత్రి పదవీ భిక్ష కాదు అని సంచలన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్కు బీజేపీ మద్దతుగా నిలిచింది. పార్టీలో ఆయనను ఒంటరిని చేశారని అర్థమవుతుందని వ్యాఖ్యానించింది. తెలంగాణ రాష్ట్రం కోసం టీఆర్ఎస్లో పోరాడిన నేతకు సరైన గౌరవం దక్కకపోవడం సరికాదన్నారు. ఈ మేరకు హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో ఆ పార్టీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు మీడియాతో మాట్లాడారు.
మంత్రి పదవీ తనకు భిక్ష కాదని ఈటల రాజేందర్ వ్యాఖ్యలను గుర్తుచేశారు కృష్ణసాగర్ రావు. ఆయన ఎంత బాధపడి ఉంటే.. ఒత్తిడికి లోనై ఉంటే ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారు అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీలో రాజకీయ అనిశ్చితి మొదలైందని విమర్శించారు. గ్రూపు రాజకీయాలు ఎక్కువై తిరుగుబాటు జరుగుతుందన్న వాదనకు ఈటల వ్యాఖ్యల బలం చేకూరుస్తున్నాయని వివరించారు. మంత్రి ఈటల వ్యాఖ్యలపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈటల వ్యాఖ్యలతో టీఆర్ఎస్లో అసమ్మతి మెల్లగా బయటపడిందన్నారు. పార్టీలోనే కాదు ప్రభుత్వంలోనే వ్యతిరేకతం ఉందని .. అదీ కూడా త్వరలో బయటపడుతుందని తెలిపారు.