కొత్త పురపాలక చట్టంలో ఎన్నో లోపాలు.. గవర్నర్కు బీజేపి ఫిర్యాదు..! ఉన్నతమైన చట్టమన్న సీఎం..!!
హైదరాబాద్ : కొత్త మున్సిపాలిటీ చట్టం పై బీజేపి మండి పడింది. రాజ్యాంగం కల్పించిన చట్టాన్ని పక్కనపెట్టి రాష్ట్రంలో లోపభూయిష్టంగా కొత్త పురపాలక చట్టం తయారు చేశారని బీజేపి నాయకులు విమర్శించారు. కొత్త చట్టాన్ని పరిశీలించి, ఆపాలని కోరుతూ మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ నేతృత్వంలోని బీజేపి నేతల బృందం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను రాజ్భవన్లో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆర్థిక వనరులు, పన్నులు, సామాజిక అంశాలు, రవాణా, తాగునీరు తదితరాలను పరిగణనలోకి తీసుకోకుండా తెలంగాణ పురపాలక చట్టం తెచ్చారని దత్తాత్రేయ ఆరోపించారు. మౌలిక సదుపాయాలు కల్పించకుండానే కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం అర్థరహితం అన్నారు.
నిర్మాణ అనుమతులను కష్టతరం..! కొత్త మున్సిపల్ చట్టం పై మండిపడ్డ బీజేపి..!!
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు, ఇతర అంశాలను 118 రోజుల్లో పూర్తి చేయాలని న్యాయస్థానం ఆదేశించగా ప్రభుత్వం మూడు వారాల్లోనే హడావిడిగా పూర్తిచేసి ఎన్నికలు త్వరగా జరపాలని ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెస్తుందని బండారు దత్తాత్రేయ ఆరోపించారు. ప్రభుత్వ తొందరపాటు కారణంగా వార్డుల విభజన, ఓటర్ల జాబితా తయారీ, రిజర్వేషన్లు తదితర అన్ని విషయాల్లోనూ అవకతవకలు, అక్రమాలు జరిగాయన్నారు. గవర్నర్ను కలిసిన వారిలో ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ మంత్రులు డీకే అరుణ, చింతల రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.
గులాబీ పార్టీ అవినీతి చిట్టా బయటపెడతాం..! మండిపడ్డ బీజేపి నేతలు..!!
గులాబీ ప్రభుత్వ అవినీతి చిట్టా విప్పేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ, కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాల్లో అవినీతిపై న్యాయస్థానాల్లో ప్రజాప్రయోజనవ్యాజ్యాలు దాఖలు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పురపాలక చట్టంలో ప్రజాప్రయోజనం లేదని, స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేసి అధికారాల్ని తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు శ్రీకారం చుట్టారని వ్యాఖ్యానించారు. మోదీ గెలుపు.. ఓ గెలుపేనా? అంటూ చంద్రశేఖర్ రావు చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని, దేశప్రజలు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేయడమేనన్నారు.
ఎంతో పకడ్బందీగా మున్సిపల్ చట్టం తెచ్చాం..! అక్రమాలను సహించేది లేదన్న సీఎం..!!
ఇదిలా ఉండగా కొత్త పురపాలక చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు హెచ్చరించారు. ఉల్లంఘించినవారు ప్రజలైనా, అధికారులైనా, ప్రజాప్రతినిధులైనా సరే శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టంచేశారు. చట్టంలో ఏదో ఆషామాషీగా నిబంధనలను చేర్చలేదని, ప్రతి వాక్య నిర్మాణంలో తాను స్వయంగా పాలుపంచుకున్నానన్నారు. అన్ని కోణాల్లో ఆలోచించే కఠిన నిబంధనలను తెచ్చామని చెప్పారు. పచ్చదనానికి ప్రథమ ప్రాధాన్యమిస్తున్నామని, ఇంటి పన్నును ఎవరికి వారే స్వీయ ధ్రువీకరణ చేసుకునే వెసలుబాటు కల్పించామని వివరించారు. ఇళ్ల నిర్మాణ అనుమతులను సరళీకరించామని, అక్రమ నిర్మాణాలను సహించబోమని అన్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో వేర్వేరు ఎన్నికలు జరగడంతో పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించలేకపోయామని ఆగస్టు 15 నుంచి అద్భుతాలు చేస్తామని చంద్రశేఖర్రావు చెప్పారు.
కొత్త మున్సిపల్ చట్టంలో కఠిన నిబంధనలు..! అధికారులు, ప్రజలకూ వర్తిస్తుందన్న కేటీఆర్..!!
కొత్త పురపాలక చట్టం మాదిరే జీహెచ్ఎంసీ చట్టం ఉంటుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తాజా చట్టంలో అనుమతుల కోసం స్వీయధ్రువీకరణ విధానం తేవడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటిందన్నారు. అక్రమ కట్టడాలకు ఇక తావుండదని, 75 గజాల్లోపు స్థలంలో ఇళ్ల నిర్మాణానికి అనుమతి అవసరం లేదని కొత్త చట్టంలో చెప్పడం పేదలకు ఊరటనిచ్చే అంశమని తెలిపారు. కలెక్టర్లకు అధికారాలు కల్పించడం సముచితని, వారికి అదనపు పనిభారమేమీ ఉండదని, పాలనా సంస్కరణలు వస్తే ఎమ్మెల్యేలకు, ఇతర ప్రజాప్రతినిధులకు గౌరవం పెరుగుతుందని అన్నారు. త్వరలోనే పురపాలక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోటీ చేసేవారికి చట్టం తెలుసుకునే వీలు కలిగిందని, చట్టంపై అవగాహన కల్పించేందుకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తామని కేటీఆర్ తెలిపారు.