ఇంకా ఎన్నాళ్లీ మోసం.. ఇంత వివక్షా.. లోక్సభలో నిలదీస్తాం.. : మోదీపై భగ్గుమన్న టీఆర్ఎస్ ఎంపీ
ప్రధాని మోదీ ఫ్యూడల్గా వ్యవహరిస్తున్నారని, ఫ్యూడల్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కంటే బీజేపీ ప్రభుత్వం ఎక్కువ తప్పులు చేస్తోందన్నారు. కరోనా వైరస్ను ఎదుర్కోవడంలో మోదీ సర్కార్ తీవ్రంగా విఫలమైందన్నారు. నిధుల కేటాయింపులో రాష్ట్రాల పట్ల తీవ్ర వివక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలందరం కలిసి మోదీ ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ఎంపీగా గెలిచి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రగతి నివేదన పేరుతో రంజిత్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రజా సేవకు తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
సీఎంగా ఉన్నప్పుడు చెప్పిందేంటి.. ఇప్పుడు చేస్తున్నదేంటి..
మోదీ గతంలో గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు.. సమఖ్య స్ఫూర్తితో నడిచే ప్రభుత్వాలు కేంద్రంలో ఉండాలన్నారని రంజిత్ రెడ్డి గుర్తుచేశారు. కానీ ఇప్పుడు ఆయన ప్రధాని అయ్యాక ఫ్యూడల్గా వ్యవహరిస్తూ.. ఫ్యూడల్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని విమర్శించారు. ప్రధానిగా తీయని మాటలు చెప్పడం తప్పితే.. ఏమీ చేయట్లేదని ఆరోపించారు. కరోనా వైరస్ను ఎదుర్కోవడంలో,ఆర్థిక స్థితి గతులను చక్కదిద్దడంలో మోదీ సర్కార్ విఫలమైందన్నారు. కరోనా కారణంగా దేశానికి రూ.10,00,050కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. కేంద్రం రూ.20లక్షల కోట్లు ప్యాకేజీ ఇస్తామని చెప్పి కేవలం రూ.2లక్షల కోట్లు మాత్రమే డబ్బు రూపంలో అందిస్తోందన్నారు. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు సీఎం కేసీఆర్ హెలికాప్టర్ మనీ ప్రతిపాదిస్తే... దాన్ని కనీసం పట్టించుకోలేదని మండిపడ్డారు.
మోదీ సర్కార్ వైఫల్యం చెందిందని ఆరోపణలు
మోదీ ఇన్నిసార్లు వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నారని... కానీ సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నం చేయడం లేదని రంజిత్ రెడ్డి విమర్శించారు. లాక్డౌన్ ప్రకటించే ముందు వలస కార్మికుల గురించి పట్టించుకోలేదన్నారు. వారిని స్వస్థలాలకు చేర్చే ప్రయత్నం చేయలేదన్నారు.వైద్య విద్య ఉపాధి అవకాశాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందని.. ఇంకా ఎన్నాళ్ళు దేశ ప్రజలను మోసం చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో వివక్ష చూపడం సరికాదన్నారు. 6 రాష్ట్రాలకు 56 శాతం నిధులు కేటాయించి.. మిగతా రాష్ట్రాలన్నింటికీ కలిపి 44 శాతం మాత్రమే కేటాయించడం వివక్షకు అద్దం పడుతోందన్నారు.
అరవింద్ విమర్శలు మాని ఆ పని చూడాలి...
ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంపుకు అనేక ఆంక్షలు పెట్టారని... కానీ కేంద్రం మాత్రం ఇష్టం వచ్చినట్టు తమ పరిమితిని పెంచుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నింటిపై లోక్సభలో బీజేపీని కచ్చితంగా నిలదీస్తామని అన్నారు. రాష్ట్ర బీజేపీ ఎంపీలు కూడా దీనిపై కేంద్రాన్ని ప్రశ్నించాలన్నారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ ప్రభుత్వంపై విమర్శలు మాని.. కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని సూచించారు. ఎన్నికల్లో గెలిచి ఏడాది అయిందని.. అరవింద్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.