రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టిన బీజేపి.!పగటి కలలు మంచివి కావని కృష్ణసాగర్ రావు హితవు.!
హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్, బీజేపి పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తారా స్దాయిలో కొనసాగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి బీజేపీ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పై చేసిన ఆరోపణలు రాజకీయ ప్రకంపనలను సృష్టిస్తున్నాయి. రేవంత్ రెడ్డి వ్యాఖలను తిప్పికొట్టేందుకు బీజేపి సీనియర్ నేతలు నడుంబిగిస్తున్నట్టు తెలుస్తోంది. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి వర్గంలో కొనసాగుతున్నందున ఆయన పట్ల అనుచిత వ్యాఖ్యలు సరికానే దిశలో బీజేపి నేతలు కౌంటర్ ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.
రేవంత్ రెడ్డి సంయమనం కోల్పోతున్నారు.. కిషన్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలు అర్థరహితమన్న బీజేపి..
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసింనందుకు రేవంత్ రెడ్డిపై బీజేపి నేతలు మండిపడుతున్నారు. బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కె.కృష్ణసాగర్ రావు రేవంత్ వ్యాఖ్యలను పూర్తిగా తప్పుబడుతున్నారు. బీజేపి నేతలు కూడా కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాల గురించి స్పందించే అవకాశం ఉన్నా అది వారి వ్యక్తిగత అంశంమని, అందుకే పార్టీ అంతర్గత అంశాల్లో బీజేపి జోక్యం చేసుకోదని, కాని కాంగ్రెస్ పార్టీ నేడు నైతిక విలువలు మరిచిపోయి వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
వార్తల్లో ఉండేందుకే రేవంత్ చీప్ ట్రిక్స్.. అర్థరహిత వ్యాఖ్యలన్న కృష్ణసాగర్ రావు..
అంతే కాకుండా బీజేపీ సీనియర్ నాయకులు, కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి పై ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనలు నిరాధారమైనవని, వాటిని కృష్ణసాగర్ రావు పూర్తిగా ఖండిస్తున్నట్టు ప్రకటించారు. ఈ మధ్య కాలంలో కేవలం వార్తల్లో ఉండటానికే కోసమే రేవంత్ రెడ్డి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నట్లు కనిపిస్తుందని, పార్టీ అదిష్టానం తాజాగా కిషన్ రెడ్డి కి తమిళనాడు రాష్ట్ర ఎన్నికల ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించడం పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని కృష్ణసాగర్ రావు స్పష్టం చేసారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కష్టమే.. రేవంత్ పగటి కలలు మానుకోవాలన్న బీజేపి..
కిషన్ రెడ్డికి పార్టీ అంతర్గత బాధ్యతలు అప్పగించడాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తో లేని రహస్య ఒప్పందాన్ని ఉన్నట్లుగా ఊహించుకుని వ్యాఖ్యలు చేయడం రేవంత్ రెడ్డి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని, ఈ వ్యాఖ్యలు పూర్తి హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. చూడబోతే రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ పునరజ్జీవం అవుతుందని పట్టపగలే కలలు కంటున్నట్లు ఉన్నారని చమత్కరించారు. చౌకబారు అబద్ధాలు చెప్పడం, బీజేపీ మరియు బీజేపీ నాయకుల పైన ఊహాజనితమైన కుట్ర, కుతంత్రాలను ప్రచారం చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీని బతికించవచ్చని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు ఉన్నారని ధ్వజమెత్తారు కృష్ణసాగర్ రావు.
కేంద్రంతో పాటు రాష్ట్రంలో ప్రజాధరణ కోల్పోయిన కాంగ్రెస్.. రేవంత్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడన్న బీజేపి..
అటు జాతీయస్థాయిలోనూ, ఇటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంతిమ దశలో ఉందని, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద కానీ, ఆ పార్టీ నాయకుల మీద కానీ ఏ మాత్రం నమ్మకం, ఆశ, విశ్వాసం లేదని, రేవంత్ రెడ్డికి నిజమైన సామర్థ్యం ఉంటే, ముందు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న అస్తిత్వ సమస్యను పరిష్కరించాలని హితవు పలికారు. కేవలం బీజేపీ పార్టీ మీద నాయకుల మీద తప్పుడు ప్రచారం చేయడం ద్వారా ఫలితం శూన్యమనే అంశం రేవంత్ రెడ్డి లాంటి నేతలు గుర్తుపెట్టుకోవాలని కృష్ణసాగర్ రావు సూచించారు.