దక్షిణాదిపై బీజేపీ పాగా..!తెలంగాణ నుంచే శ్రీకారం..!కోమటిరెడ్డి దోబూచులాట ఆంతర్యం అదేనా..?
ఢిల్లీ/హైదరాబాద్ : టార్గెట్ 2024 లక్ష్యంగా మోదీ ద్వయం పావులు కదుపుతోంది. రెండోసారి 300కు పైగా ఎంపీ సీట్లతో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిన భారతీయ జనతా పార్టీ ఈ సారి తన గురి దక్షిణాది రాష్ట్రాలపై సారించింది. ఒడిషా, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఐదు రాష్ట్రాల్లో పాగా వేయటం.. కుదరకుంటే పట్టు సాధించటం ద్వారా కాంగ్రెస్ జవసత్వాలనే కాదు.. ఏకంగా ప్రాంతీయపార్టీల హవాకు చెక్ చెప్పాలనే యోచనలో పావులు కదుపుతోంది. దీనిని సాధించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఇదంతా చాపకింద నీరులా చేస్తూ.. ఎన్నికల వేళలో మాత్రమే లాభపడాలనేది అసలు ఎత్తుగడగా తెలుస్తోంది. అందుకు తెలంగాణ ను మొదటి అస్త్రంగా వాడుకోవాలని బీజేపి ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ కకావికలం చేయాలి..! దక్షిణ భారతంలో ప్రభావం చూపాలనుకుంటున్న బీజేపి..!!
దీనిలో భాగంగానే తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్. ఎందుకంటే.. 2018 ముందస్తు ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన తెలంగాణ సీయం చంద్రశేఖర్ రావు పార్టీ ఆరు నెలల వ్యవధిలో వచ్చిన పార్లమెంటరీ ఎన్నికల్లో బొక్క బోర్లా పడ్డారు. కమలం పార్టీ ఊహకు అందని విధంగా నాలుగు చోట్ల గెలిచింది. మరో మూడు చోట్ల గెలుపు వరకూ చేరి చివర్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ లెక్కన.. సగానికి పైగా సీట్లలో భాజపా గెలిచే సత్తా ఉందనేది కాషాయపార్టీలో ఏర్పడిన నమ్మకం. దీన్ని 2023 ఎన్నికల నాటికి బలంగా మార్చుకోవటం ద్వారా తెలంగాణలో పట్టు సాదించటమే కాదు.. అదికారం సంపాదించాలనే వ్యూహం. దీనిలో భాగంగానే తెలంగాణలో చంద్రశేఖర్ రావు వల్ల చికాకు పడుతున్న రెడ్డి వర్గాన్ని ఏకం చేయటం ద్వారా నెగ్గాలనేది అమిత్ ఆలోచన.
తెలంగాణ నుండి శ్రీకారం చుట్టాలనుకుంటున్న బీజేపి..! కోమటిరెడ్డి బ్రదర్స్ తో క్లాప్..!!
అందుకే.. ఉత్తమ్ అంటే మండిపడే కోమటి బ్రదర్స్ను తమవైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేల పార్టీలోకి చేరితే మంత్రిపదవి కూడా ఇవ్వొచ్చని ప్రచారం ఊపందుకుంది. ఇదే దారిలో వివేక్ను కాషాయ కండువా కప్పి.. రాజ్యసభకు పంపవచ్చని తెలుస్తోంది. ఏపీలో వైసీపీకు ప్రత్యామ్నాయంగా బీజేపీకు ఉన్న అవకాశాన్ని కాపుల ద్వారా భర్తీ చేయాలనుకుంటుంది. పవన్ కలసి వస్తే ఓకే లేకపోతే.. బలమైన కాపు నేతలను ఒకచోటికి చేర్చటం ద్వారా అక్కడా పాగా వేయాలనేది వారి ప్రణాళిక. తమిళనాడులో రజనీకాంత్తో కలసి ఏకంగా చరిత్ర సృష్టించేలా గెలవాలనేది అమిత్షా ఎత్తుగడ అట. ఇకపోతే కర్ణాటక ఆల్రెడీ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీతో టచ్లో ఉన్నారట.
మోదీ- షా కన్ను దక్షిణ భారతం పైన..! బలోపేతం దిశగా అడుగులు..!!
వారితో కలసి అగస్టు 15 నాటికి బీజేపీ సీఎం ప్రమాణస్వీకారం చేస్తాడని టాక్ నడుస్తోంది. ఒడిషా.. ఇప్పటికిప్పుడే గాకపోయినా క్రమంగా పాగా వేసేందుకు ఏపీని వేదికగా మార్చుకోబోతున్నారు. పశ్చిమబెంగాల్లో ఈ సారి కాషాయ రెపరెపలంటూ లెక్కలేస్తున్నారు. మమతాబెనర్జీపై పెరిగిన వ్యతిరేకత తమకు కలసివస్తుందనేది గట్టి నమ్మకమట. ఏమైనా.. అమిత్షా మాస్టర్ ప్లాన్, మోదీ సహకారం.. ప్రజల్లో నెలకొన్న హిందూ భావోద్వేగాలను కమలం వికసించేందుకు మార్గంగా మలచుకోవాలనేది కమలనాథుల ఎత్తు. అదే జరిగితే.. భవిష్యత్తులో హస్తం.. ప్రాంతీయపార్టీలకు ప్రమాదఘంటికలు మోగినట్టేననే చర్చ కూడా జరుగుతోంది.
పార్లమెంట్ సమావేశాల తర్వాత ప్రత్యేక దృష్టి..! తెలుగు రాష్ట్రాలతో మొదటి ప్రయోగం..!!
వరుసగా రెండవ సారి ఎన్నికైన నరేంద్రమోదీ ప్రభుత్వంలో పదిహేడోవ లోక్సభ సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి.మొదట ప్రధానమంత్రి, ఎన్డీయే పక్షనేత నరేంద్రమోదీని లోక్సభ సభ్యుడిగా ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్ ప్రమాణస్వీకారం చేయించారు. ఆ తర్వాత ప్రధాన విపక్షమైన కాంగ్రెస్ నుంచి సురేశ్ కొడికున్నిల్, కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్షా తదితరులు ప్రమాణస్వీకారం చేశారు. కేంద్రమంత్రులు, ప్యానెల్ ఛైర్మన్లు ముందు ప్రమాణస్వీకారం చేస్తారు. ఆ తర్వాత ఇంగ్లీష్ అల్ఫాబేట్ (ఆంగ్ల అక్షర క్రమంలో) రాష్ట్రాల వారీగా ఎంపీల ప్రమాణాలు జరుగుతాయి. ఇవాళ, రేపు ఎంపీల ప్రమాణస్వీకారాలు జరుగుతాయి. బుధవారం లోక్ సభ స్పీకర్ ఎన్నిక చేపట్టనున్నారు. నేటి నుంచి జులై 26 వరకు లోక్సభ సమావేశాలు జరగనున్నాయి. జులై 5న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆతర్వాత స్థానిక రాజకీయాలు, బీజేపి బలోపేతం, ఇతర రాష్ట్రాల్లో పాగా వేయడం వంటి అంశాలపై దృష్టి సారించబోతున్నట్టు తెలుస్తోంది.