ఒక కుటుంబం చేతిలో అధికారం, సామాజిక న్యాయం ఎక్కడ.. బీజేపీ లక్ష్మణ్ విసుర్లు
విపక్షాలపై బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడ్డారు. బీజేపీతోనే బీసీలకు న్యాయం జరుగుతోందన్నారు. సామాజిక న్యాయం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ అని స్పష్టంచేశారు. బీసీని ప్రధాని చేసిన ఘనత బీజేపీకి దక్కుతుందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ బీసీ అనే సంగతి తెలిసిందే. కానీ తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం లేదన్నారు. ఒక కుటుంబం చేతిలో అధికారం కేంద్రీకృతమైందని ధ్వజమెత్తారు.
ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన వారికి.. మండలి/ రాజ్యసభ ద్వారా పదవులను ఇస్తారని చెప్పారు. ఇటీవల కవిత శాసనమండలికి ఎన్నికైన సంగతి తెలిసిందే. ఆమెను మేనెజ్ మెంట్ కోటాలో ఎమ్మెల్సీ చేశారని మండిపడ్డారు. రేపో మాపో మంత్రి పదవీ కూడా కట్టబెడతారని సందేహాం వ్యక్తంచేశారు. అలానే కరీంనగర్ లోక్సభ నుంచి ఓడిపోయిన వినోద్ను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిని చేశారని గుర్తుచేశారు. అలా వారికి సంబంధించిన వారికి పదవులు కట్టబెడతారని చెప్పారు.
దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మోసం చేశారని లక్ష్యణ్ ధ్వజమెత్తారు. బీసీలకు కేటాయించిన నిధులను దారి మళ్లిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో బీసీలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. బీసీలకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వడం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలో బీజేపీకి పట్టం కట్టాలని.. టీఆర్ఎస్ అంటే వ్యతిరేక ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదన్నారు. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగిందని లక్ష్మణ్ గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో పార్టీ మరింత బలపడనుందని ధీమా వ్యక్తం చేశారు.