కేసీఆర్కు బీజేపీ అంటే భయం.. నిద్ర కూడా రావడం లేదు, సీఎంపై జేజమ్మ విసుర్లు
సీఎం కేసీఆర్కు బీజేపీ అంటే భయం పట్టుకుందని జేజమ్మ డీకే అరుణ అన్నారు. అందుకోసమే ఫేక్ లెటర్లు సృష్టిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్కు రోజూ సరిగా నిద్ర కూడా పట్టడం లేదన్నారు. భాగ్యనగర ప్రజలపై టీఆర్ఎస్ పార్టీకి ప్రేమ లేదని చెప్పారు. కేవలం ఓట్ల కోసమే వరద సాయం ఇచ్చారని గుర్తుచేశారు. దానిని నిలిపివేసింది కూడా ఆ పార్టీ వారేనని.. తమపై లేని పోని ఆరోపణలు చేస్తున్నారని ఫైరయ్యారు.
ఏ మూలకు సరిపోతాయి..
వరద సాయం రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయని అరుణ ప్రశ్నించారు. అవీ కూడా అందరికీ పంపిణీ కాలేదని చెప్పారు. మధ్యలోనే ఆపివేయాల్సి వచ్చిందని వివరించారు. వరద సాయం రూ.550 కోట్లు కేటాయించారని చెప్పారు. కానీ బాధితుల అకౌంట్లో డబ్బులు వేయకుండా టీఆర్ఎస్ కార్యకర్తల జేబులో వేశారని ధ్వజమెత్తారు. ఆ రూ.10 వేలు అర్హులకు ఇచ్చాకే ఎన్నికల నోటిఫికేషన జారీ చేయాల్సి ఉంటే బాగుండేదని చెప్పారు. కానీ హడావిడిగా జారీచేసి.. తర్వాత నిలిపివేయాల్సి వచ్చిందని తెలిపారు.
సాయం ఆపింది మీరే..
బల్దియా ఎన్నికల కోసం నోటిఫికేషన్ ఇచ్చింది మీరు కాదా అడిగారు. వరద సాయం ఆపింది కూడా మీరేనని ఫైరయ్యారు. సాయానికి సంబంధించి డబ్బులు టీఆర్ఎస్ నాయకులే తిన్నారని చెప్పారు. ఓటమి భయంతోనే ఇదివరకు కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని గుర్తుచేశారు. గ్రేటర్ ఎన్నికలు అయ్యాక వరద సాయం రూపాయి కూడా ఇవ్వరని చెప్పారు. సీఎం కేసీఆర్కు కావాల్సింది జనాలు కాదు ఓట్లర్లు అన్నారు.
దేశాన్ని అవమానిస్తారా..?
సీఎం స్థానంలో ఉండి దేశాన్ని అవమానిస్తారా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఎంఐఎం లేకుంటే కేసీఆర్కు దిక్కే లేదని తీవ్ర ఆరోపణలు చేశారు. సిటీ అభివృద్ధి చేస్తే ఇళ్లలోకి నీరు ఎలా వచ్చాయని చెప్పారు. ఎంఐఎం ఏం చేసిందో ముస్లీంలు ఆలోచించాలన్నారు.
కౌన్ బనేగా..
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అనూహ్యంగా బీజేపీ విజయ దుందుబి మోగించడంతో.. టీఆర్ఎస్ పార్టీ ఆత్మపరిశీలనలో పడింది. బల్దియా ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలని భావిస్తోంది. బల్దియాలో విజయం సాధించి.. ప్రత్యర్థులకు గుణపాఠం చెప్పాలని అనుకుంటోంది. కానీ బీజేపీ కూడా ఇదే ధీమాతో ముందడుగు వేస్తోంది. మరీ ప్రజలు ఏ వైపు నిలుస్తారో చూడాలీ మరీ.