సద్దాం హుస్సేన్, హిట్లర్ గుర్తుకొస్తున్నారు.. కార్మికులను బెదిరించడం సరికాదు, ఇంద్రసేనా ఫైర్
కేసీఆర్ సర్కార్పై బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పాలన గాడితప్పిందని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు నెలరోజుల కింద సమ్మె నోటీసు ఇస్తే కేసీఆర్ నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. కార్మికుల డిమాండ్లు పట్టవా ? ఎందుకంత నిర్లక్ష్యంగా వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోలేదని, డిమాండ్ల సాధన కోసం వారు సమ్మె బాట పట్టారని గుర్తుచేశారు.
విధిలేక ..
తమ సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వాన్ని వేడుకున్నారని ఇంద్రసేనారెడ్డి గుర్తుచేశారు. డిమాండ్లను పరిష్కరించాలని రెండేళ్ల నుంచి అడుగుతున్న పట్టించుకోలేదన్నారు. విధిలేని పరిస్థితుల్లో వారు సమ్మె బాట పట్టారని తెలిపారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదని విమర్శించారు. ప్రభుత్వం-ఆర్టీసీ కార్మికుల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. దసరా పండగ పూట బస్సుల్లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
కేసీఆర్ వల్లే
ఆర్టీసీ కార్మికుల సమ్మె చేయడానికి సీఎం కేసీఆర్ కారణమని ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. డిమాండ్లపై తీరుస్తామని, సమయం ఇవ్వాలని కోరాలే తప్ప బెదిరించడం ఏంటీ అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ వైఖరి చూస్తూ నియంతలు హిట్లర్, సద్దాం హుస్సేన్ గుర్తుకొస్తున్నారని తెలిపారు. ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేశారనే విషయాన్ని గుర్తుచేశారు. కానీ అప్పటి ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తాం, డిస్మిస్ చేస్తామని చెప్పలేదని తెలిపారు.
మంత్రులు మౌనమునిలే..
కేసీఆర్ రాజ్యంలో మంత్రులకు స్వేచ్చ లేదు అని ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో పని విభజన జరగకపోవడంతో మంత్రులు కేసీఆర్ చెప్పిందల్లా చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో పనిచేయలేని పరిస్థితి నెలకొందని, అందుకే కేంద్రాన్ని సంప్రదించేందుకు ఐఏఎస్ అధికారులు సన్నాహాలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై స్పష్టత లేదని ఇంద్రాసేనారెడ్డి అన్నారు. దీంతో ఫైల్స్ అన్ని పెండింగ్లో ఉన్నాయనే విషయాన్ని గుర్తుచేశారు. ఒక్కో అధికారి నాలుగైదు బాధ్యతలు నిర్వర్తించడంతో ఆలస్యమవుతుందన్నారు.
బెదిరించడం సరికాదు
తమ డిమాండ్ల కోసం సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలుపుతున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. కానీ వారిని బెదిరించడం సరికాదని సూచించారు. ఉద్యోగాలు తొలగిస్తాం, ఎస్మా ప్రయోగిస్తామని భయభ్రాంతులకు గురిచేయడం మంచి పద్దతి కాదన్నారు. తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెలో దాదాపు 40 రోజులకుపైగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసిన విషయం మరచిపోయారా అని కేసీఆర్ను ప్రశ్నించారు. ఆనాటి వారి త్యాగంతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజం పడిందని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల గోడును కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు.