హరీశ్ను బలిపశువు చేశారు.. ఓడిపోతామని తెలిసి మరీ.. జితేందర్ రెడ్డి హాట్ కామెంట్స్
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం చుట్టూ రాజకీయాలు సాగుతున్నాయి. అక్కడ బీజేపీ గెలిచినా.. అధికార టీఆర్ఎస్ పార్టీలో ముసలం నెలకొంది. మంత్రి హరీశ్ రావుకి బాధ్యతలు అప్పగించడంతో ఆయన లక్ష్యంగా విమర్శలు వస్తున్నాయి. అయితే కొందరు కేసీఆర్పై కూడా కామెంట్స్ చేస్తున్నారు. కావాలనే హరీశ్ రావుని బలిపశువును చేశారని ధ్వజమెత్తారు. ఆ వరసలో బీజేపీ నేత జితేందర్ రెడ్డి ముందు నిలిచారు. కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేశారు.
దుబ్బాకలో ఓడిపోతామని సీఎం కేసీఆర్కు తెలుసు అని జితేందర్ రెడ్డి అన్నారు. తెలిసీ కూడా హరీశ్ రావుకు బాధ్యతలు అప్పగించారని తెలిపారు. ఉప ఎన్నిక పేరు చెప్పి బలి చేద్దామని అనుకొన్నారని పేర్కొన్నారు. ఇవేమీ తెలియని హరీశ్ రావు ఉప ఎన్నిక ప్రచారంలో మునిగిపోయారని తెలిపారు. కానీ ఓడిపోవడంతో అందరూ హరీశ్ రావు పేరును ప్రస్తావిస్తున్నారని గుర్తుచేశారు. కానీ ఇదీ కావాలని చేసిన ఎత్తుగడ అన్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తోందని జితేందర్ రెడ్డి తెలిపారు. 80 డివిజన్లలో గెలిచి విజయం సాధిస్తామని చెప్పారు. మేయర్ పీఠం కైవసం చేసుకోబోతున్నామని పేర్కొన్నారు. రెండో స్థానం కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీపడతాయని చెప్పారు. విజయశాంతి బీజేపీలో చేరే అంశంపై తనకు స్పష్టత లేదని చెప్పారు. బీజేపీ హిందువుల మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తోందని చెప్పారు. ఎంఐఎం ముస్లింల కోసం పనిచేయడం లేదా అని అడిగారు.