బీజేపీ నేత మురళీధర్ రావుపై 2 కోట్ల ఛీటింగ్ కేసు.. కథలో ట్విస్టులెన్నో..!
హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల వేళ బీజేపీ జాతీయ స్థాయి నేతపై మచ్చ పడింది. ఛీటింగ్ కేసు తెరపైకి రావడంతో చర్చానీయాంశంగా మారింది. నామినేటెడ్ పోస్ట్ ఇప్పిస్తామంటూ 2 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేశారనేది బాధితుల ఫిర్యాదు. అయితే నిందితులే ఉల్టా కేసు పెట్టారనేది సదరు నేత చెబుతున్న మాట. మొత్తానికి ఈ అంశం దేశవ్యాప్తంగా హాట్ టాపికయింది.
బీజేపీ అగ్రనేతపై ఛీటింగ్ కేసు
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావుపై హైదరాబాద్ లో ఛీటింగ్ కేసు నమోదైంది. నామినేటెడ్ పదవి ఇప్పిస్తామంటూ తమ నుంచి 2 కోట్ల 17 లక్షల రూపాయలు వసూలు చేశారని బాధితులు సరూర్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 9 మందిపై కంప్లైట్ ఇచ్చిన బాధితులు మురళీధర్ రావును A-8 గా పేర్కొన్నారు.
చంపాపేట ప్రాంతానికి చెందిన తాళ్ల ప్రవర్ణ రెడ్డి, తన భర్త మహిపాల్ రెడ్డికి నామినేటెడ్ పదవి కావాలంటూ సమీప బంధువైన జర్నలిస్ట్ ఈశ్వర్ రెడ్డిని సంప్రదించారు. ఆ మేరకు 2015లో బీజేపీ నేత కృష్ణకిశోర్ను సంప్రదించారు. అయితే మురళీధర్ రావు తనకు అత్యంత సన్నిహితుడని చెప్పిన కృష్ణకిశోర్.. ఆయన ద్వారా పని అవుతుందని చెప్పారట. మురళీధర్ రావుతో మాట్లాడి ఫార్మా ఎక్సెల్ బోర్డు సభ్యుడిగా నామినేటెడ్ పదవి ఇప్పిస్తానని ప్రవర్ణ రెడ్డికి హామీ ఇచ్చాడు.
నామినేటెడ్ పోస్టు కోసం 2 కోట్లు..!
తన భర్తకు నామినేటెడ్ పోస్ట్ పదవి వస్తుందని భావించిన ప్రవర్ణ రెడ్డి.. వారు అడిగిన మేరకు దఫాదఫాలుగా 2 కోట్ల 17 లక్షల రూపాయలు ఇచ్చారట. కృష్ణకిశోర్, ఈశ్వర్రెడ్డి, గాజుల హనుమంతరావు, మంద రామచంద్రారెడ్డి, సామా చంద్రశేఖర్రెడ్డి, బాబా, శ్రీకాంత్, మురళీధర్రావు, జి.శ్రీనివాస్ కు ఆ మొత్తం అందించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే సంవత్సరాలు గడుస్తున్నా.. నామినేటెడ్ పదవి ఊసెత్తకపోవడంతో తీసుకున్న డబ్బులపై వత్తిడి పెంచారు. మురళీధర్రావు సహా నిందితులుగా పేర్కొన్న వారందరు తమను బెదిరించారని బాధితురాలు పోలీసులకు తెలిపారు.
ఇచ్చిన సొమ్ముకు చెల్లని చెక్కులు
ప్రవర్ణ రెడ్డి వత్తిడి మేరకు ఆమె భర్తకు ఫార్మా ఎక్సెల్ ఛైర్మన్ గా అవకాశం కల్పిస్తామని నిందితులు హామీ ఇచ్చారు. ఆ మేరకు ఆమెకు ఓ అపాయింట్మెంట్ లెటర్ అందించారు. అయితే అది అప్పటి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సంతకాన్ని ఫోర్జరీ చేసి తయారుచేసిన నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్ గా తేలింది. ఆ నేపథ్యంలో 2016, సెప్టెంబర్ లో సరూర్ నగర్ పోలీసులకు ప్రవర్ణ రెడ్డి ఫిర్యాదు కూడా చేశారు. దాంతో ఆమె నుంచి వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి ఇచ్చివేస్తామని కృష్ణకిశోర్, రామచంద్రరావు హామీ ఇచ్చారట. దానికోసం కొంత గడువు తీసుకుని 2 కోట్ల 5 లక్షల రూపాయలకు చెక్కులు ఇచ్చారట. అయితే వారు చెప్పిన గడువు సమయానికి చెక్కులు చెల్లక.. రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించారు. అదలావుంటే తాజాగా ప్రవర్ణ రెడ్డి ఫిర్యాదు మేరకు సరూర్ నగర్ పోలీసులు 9 మందిపై కేసు నమోదు చేశారు. ఐపీసీ 406, 420, 468, 478, 506, 156(3) సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు.
అసలు నిందితులు ఉల్టా కేసు పెట్టారట..!
ఇదే విషయంలో 2016లో మురళీధర్ రావు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిర్మలాసీతారామన్ సంతకం ఫోర్జరీ, నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్ పై ఎ.కృష్ణకిశోర్, మంద రామచంద్రారెడ్డిలను నిందితులుగా పేర్కొన్నారు. అదలావుంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్ కు చేరిన ఫిర్యాదు అసలు నిందితులు పెట్టిన కేసుగా అభివర్ణించారు మురళీధర్ రావు. ఆ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు.
మురళీధర్ రావుపై రాజకీయ కక్షతోనే కేసు పెట్టారని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్రావు. తప్పుడు ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని మండిపడ్డారు. ఇది బీజేపీ ప్రతిష్టను దెబ్బతీసే రాజకీయ ప్రేరేపిత చర్యగా అభివర్ణించారు. మురళీధర్ రావుపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసు ఫైల్ చేసిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.