సినీనటులతో మంత్రి విదేశీ పర్యటనలు.. బీజేపీ నేత వివేక్ హాట్ కామెంట్స్
తెలంగాణ మంత్రి కేటీఆర్పై బీజేపీ నేత వివేక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్, కేసీఆర్కు పాలనపై శ్రద్ద లేదని విమర్శించారు. కాళేశ్వరం బిల్లుల మీద ఉన్న ఇంట్రెస్ట్.. పరిపానలపై లేదని మండిపడ్డారు. కేటీఆర్, కేసీఆర్ చర్యలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని పేర్కొన్నారు. వారికి తగిన బుద్ధి చెప్తారని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ హవా మొదలైందని తెలిపారు.
గత బల్దియా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని వివేక్ అన్నారు. అప్పటి హామీలను నెరవేర్చని ప్రభుత్వం.. మళ్లీ ఏ మొహం పెట్టుకుని ఎన్నికలకు వస్తుందని ప్రశ్నించారు. ఇక మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు భాగ్యనగర అభివృద్ధిపై సోయి లేదన్నారు. నగర ప్రజల బాగోగులను కేటీఆర్ పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇది మంచి పద్ధతి కాదని సూచించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని, ప్రజలు అన్నింటిని గమనిస్తున్నారని,, సమయం చూసి బుద్ధి చెప్తారని వివేక్ అన్నారు.
ప్రజా సమస్యలను కేటీఆర్ పట్టించుకోవడం లేదని, కానీ సినీ నటులతో విదేశాలలో తిరుగుతున్నారని ఆరోపించారు. ఓ బాధ్యతాయుతమైన పదవీలో ఉన్న మంత్రి బల్దియా పౌరులు బాగోగులు పట్టించుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు. హైదరాబాద్ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్వహణను కేటీఆర్ తన మిత్రుడికి ఇచ్చారని ఆరోపించారు. వారు దానిని గాలికొదిలేశారని మండిపడ్డారు. బంగారు తెలంగాణ పేరు చెప్పి, కేసీఆర్, కేటీఆర్ శూన్య తెలంగాణ చేశారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని వివేక్ దుయ్యబట్టారు. కానీ అభివృద్ధి పడకేసిందని, ఇందుకు కారణం తండ్రికొడుకులేనని విమర్శించారు.