ఈసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల ధర్నా, ఈసీ, సీఎం కేసీఆర్పై విమర్శలు
గ్రేటర్ పోలింగ్ సమయం సమీపిస్తోన్న వేళ ఆందోళనలు మిన్నంటాయి. అధికార టీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల సంఘం అనుకూలంగా పనిచేస్తోందని బీజేపీ ఆరోపించింది. ఇవాళ ఈసీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగింది. ఈసీ, సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేసింది. బీజేపీ ధర్నా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బీజేపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని.. స్థానిక పోలీసు స్టేషన్కు తరలించారు.
టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈసీతోపాటు పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. ఈసీ కార్యాలయం వద్ద బీజేపీ నేతలు రఘునందన్ రావు, రామచంద్రరావు, నల్లు ఇంద్రసేనా రెడ్డి నిరసన చేపట్టారు. ఎన్నికలను ప్రజాస్వామ్య బద్దంగా నిర్వహించాలని కోరారు. కానీ టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం సరికాదన్నారు.
బీజేపీ శ్రేణులు మెరుపు ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అక్కడినుంచి వారిని తరలించేందుకు కష్టపడ్డారు. తొలుత నేతలను అక్కడినుంచి పంపించివేశారు. తర్వాత కార్యకర్తలను తీసుకెళ్లారు. మరోవైపు మన్సూరాబాద్ డివిజన్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మంత్రి జగదీశ్ రెడ్డి ఇంటికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వచ్చారు. అక్కడ గుమిగూడి డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డితో బీజేపీ కార్యకర్తలకు వాగ్వివాదం జరిగింది.
అక్కడినుంచి వెళ్లిపోవాలని దండం పెట్టీ మరీ కోరారు. ఈ క్రమంలోనే సుధీర్ రెడ్డి, జగదీశ్ రెడ్డి వెళ్లిపోయారు. దీంతో గొడవ సద్దుమణిగింది. లేదంటే చేయిదాటే అవకాశం ఉండేది.