దేశద్రోహులతో కేసీఆర్ మిలాఖత్: తెలంగాణ పోలీసులేమీ తక్కువ తినలేదు: ఎమ్మెల్యే రాజాసింగ్.. !
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రశాఖ ఫైర్ బ్రాండ్.. ఎమ్మెల్యే రాజాసింగ్. తాను చెప్పదలచుకున్నది సూటిగా, సుత్తి లేకుండా చెప్పేస్తారు. మొహమాటం లేకుండా విమర్శలు గుప్పిస్తారు. ఆయన మరోసారి తన మార్క్ ఏమిటో చూపించారు. విమర్శల పదును పెంచారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీని టార్గెట్ గా చేసుకుని నిప్పులు చెరిగారు.
రాజాసింగ్ సంచలనం: సీఏఏకు అనుకూలంగా సభ, అనుమతి ఇవ్వాలని సీపీకి లేఖ..
దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అసదుద్దీన్ ఒవైసీ ఇటీవలే హైదరాబాద్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభకు అనుమతి ఇచ్చి కేసీఆర్ తప్పు చేశారని అన్నారు. పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన చట్టానికి వ్యతిరేకంగా తలపెట్టిన బహిరంగ సభకు అనుమతి ఇవ్వడం ద్వారా మతోన్మాద శక్తులతో చేతులు కలిపినట్టయిందని విమర్శించారు. పార్లమెంట్ వ్యవస్థను కించపరిచారని మండిపడ్డారు.
ఒవైసీ వంటి మతోన్మాద శక్తుల కుట్రలను భగ్నం చేయడానికి భారతీయ జనతా పార్టీ చేస్తోన్న ప్రతి చర్యను కేసీఆర్ అడ్డుకుంటున్నారని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని రాజాసింగ్ అన్నారు. దీనికి తగిన మూల్యాన్ని చెల్లించుక తప్పదని హెచ్చరించారు. పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా తెలంగాణ బీజేపీ రాష్ట్రశాఖ నాయకులు ర్యాలీలను నిర్వహించడానికి కేసీఆర్ ఎందుకు అనుమతి ఇవ్వట్లేదని నిలదీశారు.
"तेलंगाना सरकार का हाथ दंगाइयों के साथ"
— Raja Singh (@TigerRajaSingh) December 27, 2019
देश विरोधी नारे लगाने, देश विरोधी कार्य करने और देश के युवाओं को भड़काने वालो को तेलंगाना की सरकार और पुलिस प्रशासन अनुमति देता है पर देश मे #CAA प्रति फैला रहे झूट से पर्दा उठाने के लिए किए जारहे कार्य को परमिशन नही दी जारही। #SupportCAA pic.twitter.com/4OBauiNw7S
తాను నిర్వహించిన బహిరంగ సభలో అసదుద్దీన్ ఒవైసీ.. భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారని, రాజ్యాంగాన్ని కించపరిచేలా, పార్లమెంట్ వ్యవస్థను అవమానించేలా వ్యాఖ్యానాలు చేశారని రాజాసింగ్ ఆరోపించారు. యువతను రెచ్చగొట్టేలా ప్రసంగించారని అన్నారు. అలాంటి దేశ వ్యతిరేక సభలను నిర్వహించడానికి అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. తెలంగాణ పోలీసులు, తెలంగాణ ముఖ్యమంత్రి దేశద్రోహులకు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు.