గ్రేటర్ వార్: ఉస్మానియాలోకి వెళ్ళిన బీజేపీ ఎంపీ తేజశ్వి సూర్య..అడ్డుకున్న పోలీసులు, తీవ్ర ఉద్రిక్తత
జిహెచ్ఎంసి ఎన్నికలలో ప్రచార పర్వం సాగుతుంది. జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బీజేపీ ఎంపీ , బిజెపి యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ లోకి వెళ్తున్న క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉస్మానియా యూనివర్సిటీ లోని ఎన్ సీసీ గేటు దగ్గర బీజేపీ యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య ను పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ క్రమంలోనే ఉస్మానియా యూనివర్సిటీ వద్ద పోలీసులకు బిజెపి కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బిజెపి కార్యకర్తలు గేట్లు దూకి ఉస్మానియా యూనివర్సిటీ లోపలికి వెళ్లారు. తేజస్వి సూర్య తో పాటుగా, బిజెపి కార్యకర్తలు ఉస్మానియా యూనివర్సిటీ లోపలికి వెళ్లడం పై పోలీసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
తేజస్వి సూర్య కు సంబంధించిన ఎన్నికల ప్రచార షెడ్యూల్లో ఉస్మానియా యూనివర్సిటీ లో ఎలాంటి ప్రోగ్రాం లేదని, ఉస్మానియా యూనివర్సిటీ లో తేజస్వి సూర్య ప్రచారం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని పోలీసులు అంటున్నారు.
అయితే పెద్ద ఎత్తున బిజెపి కార్యకర్తలు ఉండడంతో, పోలీసుల సంఖ్య తక్కువగా ఉండటంతో అడిషనల్ ఫోర్స్ ను తప్పించుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ లోపలికి కార్యకర్తలతో కలిసి ఎంటరైన తేజస్వి సూర్య ఆర్ట్స్ కళాశాల వద్ద బిజెపి యువ నేతలతో కలిసి పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ పాదయాత్ర సందర్భంగా మాట్లాడిన తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుందని విమర్శలు గుప్పించారు.
Recommended Video
అవినీతి రహిత నగర అభివృద్ధి గురించి ఆలోచించే ఏకైక పార్టీ బీజేపీ అని ఆయన గట్టిగా చెప్పారు . స్మార్ట్ సిటీ కి సెలెక్ట్ చేస్తే ఏం చేశారు అంటూ టీఆర్ఎస్ ను ప్రశ్నించారు. ఫార్మా సిటీ , మూసీ ప్రక్షాళన, నగరాభివృద్ధి ఏమైందని తేజస్వి టిఆర్ఎస్ పార్టీని నిలదీశారు.