సర్పంచుల అరెస్ట్ అప్రజాస్వామికం.. సీఎం కేసీఆర్పై ఎంపీలు ధర్మపురి, బండి ఫైర్
ఢిల్లీ : తెలంగాణ సీఎం కేసీఆర్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీజేపీ ఎంపీలు ధర్మపురి అర్వింద్, బండి సంజయ్. తెలంగాణలో సర్పంచుల అరెస్ట్ తీరును ఖండిస్తూ ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారిద్దరూ మాట్లాడారు. మంగళవారం (23.07.2019) నాడు జగిత్యాల జిల్లా కేంద్రంలో 380 మందికి పైగా సర్పంచులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.
సీఎం కేసీఆర్కు పాలనపై అవగాహన లేక కొన్ని అనవసర నిర్ణయాలు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు ధర్మపురి అర్వింద్. ఇదివరకు సర్పంచ్, కార్యదర్శికి ఉన్న చెక్ పవర్ రూల్స్ మార్చి ఉపసర్పంచులకు ఎలా ఇస్తారని ఫైరయ్యారు. ఏదిఏమైనా సర్పంచులను అరెస్ట్ చేయడం మాత్రం అప్రజాస్వామిక చర్య అన్నారు.
అలా "బంగారు తెలంగాణ" రాదు.. ఐపీఎస్ అధికారి బాంబ్.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకేనా..?
చెక్ పవర్ తదితర గ్రామ సమస్యలపై జగిత్యాలలో ఆందోళన చేసిన సర్పంచులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు బండి సంజయ్. జగిత్యాల జిల్లా కలెక్టర్ విధి నిర్వహణలో సమర్థవంతంగా పనిచేయాలే తప్ప అధికార పార్టీకి కొమ్ము కాయొద్దని హితవు పలికారు. ఆ క్రమంలో తన ప్రవర్తన మార్చుకోవాలని సూచించారు.
ఎల్ఈడీ బల్బుల పంపిణీలో అవకతవకలు జరిగాయని ఆ క్రమంలో పెద్ద కుంభకోణమే జరిగిందని ఆరోపించారు సంజయ్. ఆ అవినీతి బండారంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. స్వచ్ఛ భారత్ స్కీమ్ కింద మరుగుదొడ్ల నిర్మాణంలో సర్పంచులపై ప్రభుత్వం వత్తిడి తెస్తోందని మండిపడ్డారు. ఆ క్రమంలో ప్రభుత్వం చెప్పినట్లు వినని సర్పంచులను అరెస్టు చేయడం దారుణమన్నారు.