కాంట్రాక్టర్ల కోసమే ఆ నిర్మాణాలు.. అప్పుల కుప్పగా రాష్ట్రం.. కేసీఆర్పై మురళీధర్ రావు సెటైర్లు
హైదరాబాద్ : కొత్త అసెంబ్లీ, సచివాలయం నిర్మాణాలకు సీఎం కేసీఆర్ భూమిపూజ చేసిన తరుణంలో విపక్ష నేతలు మాటల యుద్దానికి దిగుతున్నారు. ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. అసెంబ్లీ భవనంతో పాటు సెక్రటేరియట్ కూడా పటిష్టంగా ఉన్నప్పటికీ కొత్త భవనాల జోలికి ఎందుకు వెళుతున్నారో వేరే చెప్పనక్కర్లేదని ఎద్దేవా చేస్తున్నారు.
ఆ క్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు సీఎం కేసీఆర్పై విరుచుకుపడ్డారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలు ప్రస్తావించారు. కేవలం కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకే కేసీఆర్ ఈ కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. పాత సచివాలయం కూలగొడుతూ కొత్త సెక్రటేరియట్ నిర్మించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
ధూం మచాలే.. ఎంపీ అభినందన సభలో అసభ్య నృత్యాలు.. అభాసుపాలైన లీడర్లు
సచివాలయానికి రావడమే అలవాటు లేని కేసీఆర్ కొత్త భవనం ఎందుకు నిర్మిస్తున్నారని ధ్వజమెత్తారు. 600 కోట్ల రూపాయల విలువైన సచివాలయాన్ని కూలగొట్టి ఏం సాధించనున్నారని ప్రశ్నించారు. ఇదంతా కూడా ప్రజాధనం దుర్వినియోగం చేయడానికేనంటూ మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పాలించిన 16మంది ముఖ్యమంత్రులు 69వేల కోట్ల రూపాయల అప్పు చేస్తే.. కేవలం ఐదేళ్లలో కేసీఆర్ ఏకంగా వాటిని లక్షా 80 వేల కోట్ల రూపాయలకు చేర్చారని ఆరోపించారు. కేసీఆర్ కారణంగా తెలంగాణలో ప్రతి వ్యక్తి మీద 40 వేల రూపాయల అప్పు ఉందన్నారు.
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. నియంతలా ప్రవర్తిస్తూ కేసీఆర్ ఏమి సాధిస్తారని ఫైరయ్యారు. ప్రతిపక్షాలను సైతం నిర్వీర్యం చేయాలని చూడటం అప్రజాస్వామికం కాదా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ కూడా టీఆర్ఎస్తో జతకట్టి మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడుతూ నాటకాలాడుతోందని మండిపడ్డారు.