కాంగ్రెస్ వైపు కేసీఆర్ అడుగులు!? బీజేపితో "కల్వకుంట"నే మంచిది..!
Recommended Video
హైదరాబాద్ : తెలంగా ణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు హస్తాలు మళ్లి కాంగ్రెస్ పార్టీ పైపు చూపిస్తున్నాయా..? యూపీఏ కూటమికి ఆయన దగ్గర కావాలని భావిస్తున్నారా..? ఇందుకు కర్ణాటక సీఎం కుమారస్వామి ద్వారా రాయబారం నడుపుతున్నారా ? లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్డీయే మళ్లీ అధికారంలోకి రాదన్న అంచనాలే ఇందుకు కారణమా ? ఈ ప్రశ్నలకు యస్ అనే అంటున్నాయి జాతీయ మీడియా సంస్థలు. చంద్రశేఖర్ రావు చూపు తాజాగా కాంగ్రెస్ వైపు మళ్లిందనే కథనాలు వస్తున్నాయి. కేంద్రంలో తిరిగి బీజేపీ అధికారంలోకి రాదనే నమ్మకంతోనే ఆయన కాంగ్రె్సకు దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలు పెట్టారని విశ్లేషిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడడానికి మరో రెండు వారాల ముందు చంద్రశేఖర్ రావు అడుగులు సంచలనంగా మారాయనే చర్చ జరుగుతోంది.
ఆ విషయంలో టీడీపీకి మద్దతు ప్రకటించిన వైసీపీ: చంద్రబాబు అలా అడగటంలో న్యాయం ఉంది
కేసీఆర్ అడుగులు వినూత్నం..! ఆయన పలుకులు సంచలనం..!!
కాంగ్రెస్, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు గతంలోనే శ్రీకారం చుట్టిన చంద్రశేఖర్ రావు, ఇటీవల మరోసారి ఫ్రంట్ దిశగా అడుగులు వేశారు. ఇందులో భాగంగానే రెండు రోజుల కిందట కేరళ సీఎం విజయన్తో భేటీ అయ్యారు. అదే సమయంలో, ఆలమట్టి నుంచి జూరాలకు నీటి విడుదలకు కర్ణాటక సీఎం కుమారస్వామితో చంద్రశేఖర్ రావు టెలిఫోన్లో మాట్లాడారని కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. అప్పుడే.. జాతీయ రాజకీయాలపైనా ఇద్దరి మధ్య చర్చ జరిగిందని అక్కడి పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు భిన్నంగా, కాంగ్రెస్తో సఖ్యతకు చంద్రశేఖర్ రావు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది.
బీజేపీ మళ్లీ అధికారంలోకి రాదనే అంచనా..! అందుకే యూపీఏ తో సఖ్యతకు యత్నం..!!
తెలంగాణలో కాంగ్రె్సను తుడిచి పెట్టేయాలనే పట్టుదలతో ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో అత్యధికులను టీఆర్ఎస్ వైపు లాక్కున్న సీఎం చంద్రశేఖర్ రావు, రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో అదే పార్టీతో కలిసి నడిచే మార్గాన్ని అన్వేషిస్తూ కుమారస్వామి సాయం కోరినట్లు జాతీయ మీడియా విశ్లేషిస్తోంది. చంద్రశేఖర్ రావు ప్రతిపాదనకు కుమారస్వామి కూడా ఆసక్తి చూపారని ఆ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో టీఆర్ఎస్ గెలిచే లోక్సభ సీట్ల గురించే కాకుండా ఏపీలో జగన్ గెలిచే సీట్ల విషయాన్ని చంద్రశేఖర్ రావు ప్రస్తావించారని, బహుశా, వాళ్లిద్దరూ కలిసే పని చేస్తున్నట్లు ఉందని ఆ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ప్రధానిగా మోదీ విఫలమయ్యారని, రాహుల్ రోజురోజుకు పరిణతి చెందుతున్నారంటూ లోక్సభ ఎన్నికల సమయంలో ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రశేఖర్ రావు వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి.
కాంగ్రె్సతో నేరుగా సంప్రదించలేని స్థితి..! కర్ణాటక సీఎం కుమారస్వామితో రాయబారం..!!
కాంగ్రెస్ మద్దతుతో సీఎంగా కొనసాగుతున్నందున లోక్సభ ఫలితాల తర్వాత కుమారస్వామి బీజేపీకి మద్దతు ఇచ్చే ప్రసక్తే ఉండదని ఆ వర్గాలు తెలిపాయి. రాహుల్ ప్రధాన మంత్రి అభ్యర్థిత్వానికే కుమారస్వామి, దేవెగౌడ మద్దతు ఇస్తారని వ్యాఖ్యానించాయి. చంద్రశేఖర్ రావు కాంగ్రెస్ వైపు దృష్టి సారించడానికి తాజా పరిణామాలూ కారణమని వివరిస్తున్నాయి. ఈసారి ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాల మద్దతు అవసరమని బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ చేసిన వ్యాఖ్యను గుర్తు చేస్తున్నాయి. మరోవైపు, ఫ్రంట్ కోసం చంద్రశేఖర్ రావు ఇప్పటి వరకు మంతనాలు జరిపిన వారిలో కర్ణాటక సీఎం కుమారస్వామి కాకుండా, డీఎంకే అధినేత స్టాలిన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ తదితరులు ఉన్నారు. వీరందరికీ కాంగ్రెస్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారంతా బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని మీడియాలో విశ్లేషణలు వస్తున్నాయి.
ఫలితాల తర్వాత కాంగ్రెస్ కూటమికే మద్దతు..! జాతీయ మీడియాలో విస్తృత ప్రచారం...!!
ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రశేఖర్ రావు బీజేపీకి దూరమైనట్టేనని అంచనా వేస్తున్నాయి. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ, కాంగ్రెస్ కూటముల మధ్య అధికారం దోబూచులాడే రాజకీయ పరిస్థితులు ఉత్పన్నమైతే, చంద్రశేఖర్ రావు మద్దతు కాంగ్రెస్ కూటమికి ఉంటుందని కూడా కథనాలు వెలువడుతున్నాయి. ఇందుకు చంద్రశేఖర్ రావు సన్నిహితుడు, ఎంపీ వినోద్ తాజా వ్యాఖ్యను గుర్తు చేస్తున్నాయి. ఈసారి యునైటెడ్ ఫ్రంట్ తరహా ప్రభుత్వం ఏర్పడుతుంది. కాంగ్రెస్ బయటి నుంచి మద్దతు ఇస్తే, ప్రాంతీయ పార్టీలన్నీ కలిపి గతంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈసారి కూడా అటువంటి సంకీర్ణమే ఏర్పడుతుంది. ఇందులో సందేహం అక్కర్లేదు, అని ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ వైఖరి మారుతోందని చెప్పడానికి ఎంపీ వినోద్ వ్యాఖ్యలు నిదర్శనమని జాతీయ మీడియా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇదే నిజమైతే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సీఎంలూ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వానికే మద్దతు ఇచ్చే అవకాశం ఉందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.