కరోనా చికిత్స ఆరోగ్య శ్రీలో చేర్చండి.. గవర్నర్కు బండి సంజయ్ రిక్వెస్ట్
తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఫైరయ్యారు. కరోనా వైరస్కు చికిత్స అందజేయడం లేదని విరుచుకుపడ్డారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని పదే పదే కోరుతన్న సంగతి తెలిసిందే. ఇవాళ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్కు లేఖ రాశారు. కరోనాను నియంత్రించటంలో, వైద్య వసతులు కల్పించడంలో టీఆర్ఎస్ సర్కార్ విఫలమైందని విరుచుకుపడ్డారు. అందువల్లే పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గవర్నర్కు తెలియజేశారు. ఈ మేరకు మెయిల్ ద్వారా గవర్నర్కు లేఖ పంపారు.
గత్యంతరం లేని పరిస్థితుల్లో పేదలు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స కోసం పేదలు ఆస్తులు అమ్ముకుని అప్పుల్లో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకం 'ఆయుష్మాన్ భారత్'లో కరోనా చికిత్స ఉచితంగా అందిస్తున్నట్లే..'ఆరోగ్య శ్రీ' ద్వారా కూడా కరోనా చికిత్స ఉచితంగా చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
తెలంగాణలో 'ఆయుష్మాన్ భారత్'ను అమలు చేస్తామని చెప్పి మరీ సీఎం కేసీఆర్ మాట తప్పాడని బండి సంజయ్ విమర్శించారు. ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్స పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని గవర్నర్కు రాసిన లేఖ ద్వారా బండి సంజయ్ డిమాండ్ చేశారు. కరోనా సమయంలో కార్పొరేట్ ఆస్పత్రులు పేదల నుంచి లక్షలకు లక్షలు వసూల్ చేస్తున్నారని చెప్పారు. అడ్వాన్స్ పేరుతో డబ్బులను గుంజుతున్నారని విరుచుకుపడ్డారు. దీనిని ఆపాల్సిన అవసరం ఉందన్నారు.