సినీ నటి పట్ల అసభ్య ప్రవర్తన: మాజీ ఎమ్మెల్యే కొడుకు ఆశిష్ గౌడ్పై బీజేపీ సస్పెన్షన్ వేటు
హైదరాబాద్: పటాన్చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ గౌడ్పై భారతీయ జనతా పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. సినీ నటి, బిగ్ బాస్ ఫేమ్ సంజనపై ఆయన దాడి చేశారన్న వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
మహిళల సంక్షేమం, వారి రక్షణకు బీజేపీ కట్టుబడి ఉందని, మహిళలపై ఎలాంటి దాడులనూ బీజేపీ సహించబోదని బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మాచన్నగారి నరేందర్ రెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు.
రెండ్రోజుల క్రితం తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ గౌడ్ పై సంజన పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆశిష్ తనపై మద్యం బాటిళ్లతో దాడికి దిగాడని, బిల్డింగ్పై నుంచి తోసి వేయడానికి ప్రయత్నించాడని ఆమె ఆరోపించింది.
హైటెక్స్ సమీపంలోని నోవాటెల్ హోటల్లో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సంజన తన ఫిర్యాదులో పేర్కొంది. రాత్రి 2 గంటల సమయంంలో తన స్నేహితురాలితో కలిసి నిలబడివున్న సమయంలో ఈ ఘటన జరిగిందని తెలిపింది.
మాదాపూర్ హైటెక్స్లోని నోవాటెల్ హోటల్లో శనివారం రాత్రి ఆశిష్ బీభత్సం సృష్టించాడని సంజన తన పిర్యాదులో పేర్కొన్నారు. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే గాక, అభ్యంతరకరమైన పదజాలంతో దూషించాడని ఆమె ఈ మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై ఫిర్యాదు చేసింది.
ఆశిష్ వేధింపులతో భయభ్రాంతులకు గురై అక్కడ్నుంచి తప్పించుకున్నామని సంజన వెల్లడించింది. అక్కడి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తే నిజాలు బయటకు వస్తాయని ఆమె తెలిపింది. సంజన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆశిష్ గౌడ్పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.
తనకు ఆ అమ్మాయి తెలియదంటూ ఆశిష్
కాగా, తనపై వచ్చిన వేధింపుల ఆరోపణలను ఆశిష్ గౌడ్ ఖండించారు. తాను నోవాటెల్కు వెళ్లిన మాట వాస్తవమేనని, అయితే, తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు. విచారణలో అన్ని విషయాలు బయటికి వస్తాయని తెలిపారు. తనపై ఫిర్యాదు చేసిన అమ్మాయి ఎవరో తనకు తెలియదని చెప్పారు.