జీహెచ్ఎంసీఎన్నికలు టార్గెట్ గా కమలదళం .. బీజేపీ పాదయాత్ర.. రంగంలోకి బండి సంజయ్
జిహెచ్ఎంసి ఎన్నికలకు బిజెపి సమాయత్తమవుతోందా ? ఈసారి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ కి చుక్కలు చూపించడానికి తెలంగాణ బిజెపి అగ్రనాయకులు ఇప్పటి నుంచే రంగం లోకి దిగుతున్నారా ? తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దూకుడు చూపిస్తున్న బండి సంజయ్ గ్రేటర్ ఎన్నికల్లో తన మార్కు ఉండేలా ప్రయత్నం చేస్తున్నారా అంటే అవును అన్న సమాధానమే వస్తుంది.
బీజేపీ అసెంబ్లీ ముట్టడి .. అడ్డుకున్న పోలీసులు.. బండి సంజయ్ తో సహా రాష్ట్ర వ్యాప్త అరెస్టులు
గ్రేటర్ ఎన్నికలకు మొదలైన కసరత్తు .. ఎన్నికలపై టీఆర్ఎస్ వ్యూహాలు
గ్రేటర్ ఎన్నికల నిర్వహణ దిశగా జీహెచ్ఎంసీలో కసరత్తు మొదలైంది. ఇప్పటికే బల్దియా ఎన్నికల విభాగం వివరాలు కూడా పంపించినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణకు కావాల్సిన ముందస్తు కార్యక్రమాలన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. ఒక వారం రోజుల్లో ఎన్నికల సంఘం అధికారులతో సమావేశమై ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలను చర్చించనుందని సమాచారం . గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ, మరోమారు గ్రేటర్ హైదరాబాద్ లో గులాబీ జెండా ఎగురవేయాలని వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. కేటీఆర్ ఇప్పటి నుండే జిహెచ్ఎంసి ఎన్నికల దృష్టితో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఎన్నికలే లక్ష్యంగా రంగంలోకి బీజేపీ .. బండి సంజయ్ పాదయాత్ర
ఇదే సమయంలో టిఆర్ఎస్ పార్టీ కి చెక్ పెట్టడానికి, బలం పుంజుకోవడానికి, బిజెపి జిహెచ్ఎంసి ఎన్నికలను టార్గెట్ చేయాలని నిర్ణయించుకుంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నేపథ్యంలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ నెలాఖరు వరకు పార్లమెంటు సమావేశాలు కొనసాగనున్న దృష్ట్యా, ఎంపీగా ఉన్న బండి సంజయ్ వచ్చే నెల మొదటి వారం నుండి గ్రేటర్ హైదరాబాద్ నగరంలో పాదయాత్ర చేయాలని భావిస్తున్నారు. మొత్తం 150 డివిజన్ల పరిధిలో బిజెపి పాదయాత్ర కొనసాగేలాగా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లుగా బిజెపి వర్గాల సమాచారం.
గ్రేటర్ ఎన్నికలపై పట్టు కోసం ఇప్పటి నుండే ప్రజల్లోకి కమల దండు
గ్రేటర్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన సర్వే కూడా ఈ క్రమంలోనే నిర్వహించనున్నట్లు గా తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ తీరుపై దూకుడుగా ముందుకు వెళుతున్న బిజెపి, రాష్ట్ర కొత్త రథసారథి సారధ్యంలో గ్రేటర్ ఎన్నికలపై పట్టు బిగించేందుకు ఇప్పటి నుండే కసరత్తులు ప్రారంభించనుంది. జిహెచ్ఎంసి ఎన్నికలపై కన్నేసిన కమలదళం, ఈ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధిస్తే భవిష్యత్తు ఎన్నికల్లో బీజేపీ పట్టు కొనసాగుతుందని భావిస్తోంది.
బండి సంజయ్ దూకుడు .. బీజేపీ బలోపేతం అవుతుందంటున్న కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటుగా, గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటడానికి రంగంలోకి దిగిన బండి సంజయ్ ఏమేరకు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారో తెలియకున్నా బండి సంజయ్ దూకుడు మాత్రం పార్టీని గ్రేటర్లో బలోపేతం చేసే దిశగా కనిపిస్తోంది. ఇటీవల టిఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ జిహెచ్ఎంసి ఎన్నికల్లో బిజెపికి ప్రస్తుతమున్న స్థానాల కంటే ఎక్కువ స్థానాలు దక్కే అవకాశం ఉందని ప్రకటించారు. కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది అని ఆయన వ్యాఖ్యానించారు . ఈ మాటలను బట్టి కూడా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటుంది అన్న సంకేతాలు వస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్ గా ... గ్రేటర్ ఎన్నికలపై బీజేపీ నజర్
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కూడా జీహెచ్ఎంసీ ఎన్నికలపై దృష్టిసారించారు. ఈ ఎన్నికలను రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావిస్తుంది బిజెపి. ఇప్పుడు గ్రేటర్ పై పట్టు సాధిస్తేనే తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి పట్టు కొనసాగుతుందని భావిస్తోంది. అందులో భాగంగానే పాదయాత్రలతో ఇప్పటినుండే ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని బిజెపి సన్నాహాలు చేస్తోంది. డివిజన్ల వారీగా ప్రజా సమస్యలు తెలుసుకుని డివిజన్ల వారీగా క్షేత్ర స్థాయిలో పార్టీ బలం పెంచుకోవాలని సమాయత్తం అవుతుంది .