ఊపు మీదున్న బీజేపీ... జీహెచ్ఎంసీ అభ్యర్థుల తొలి జాబితా నేడే... బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలపై ఆరోపణలు..
దుబ్బాక ఉపఎన్నిక గెలుపుతో ఊపు మీదున్న బీజేపీ... జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ అదే ఊపును కొనసాగించాలనుకుంటోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవడమే ఆలస్యం... అప్పుడే అభ్యర్థుల తొలి జాబితాను సిద్దం చేసింది. మంగళవారం(నవంబర్ 17) సాయంత్రం 50 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ ప్రకటించే అవకాశం ఉంది.అభ్యర్థుల ఎంపికలో అధికార టీఆర్ఎస్ కంటే బీజేపీ ముందుండటం గమనార్హం.
'బ్యాలెట్'పై ఆరోపణలు...
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రసేనారెడ్డి జీహెచ్ఎంసీ ఎన్నికలపై మాట్లాడుతూ... బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు నిర్వహిస్తే రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందని ఆరోపించారు. ఎన్నికల్లో అక్రమాలను నిలువరించేందుకు బీజేపీ కార్యకర్తలు సిద్దంగా ఉన్నారని చెప్పారు. ఎన్నికల కమిషన్ అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తోందని ఆరోపించారు.సరైన సమాచారం ఇవ్వకుండానే నామినేషన్ల ప్రక్రియను ప్రారంభించడమేంటని ప్రశ్నించారు. దుబ్బాక కంటే బలంగా జీహెచ్ఎంసీలో ప్రజలు టీఆర్ఎస్ను దెబ్బకొట్టాలని చూస్తున్నారన్నారు. ఈ ఎన్నికల్లో విజయం తమదేనని... మేయర్ పీఠం బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల కమిటీలు...
జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం బీజేపీ పలు కమిటీలను ఏర్పాటు చేసింది. ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్గా ఇంద్రాసేనరెడ్డి, మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్గా వివేక్,ప్రచార కమిటీ ఛైర్మన్గా డీకే అరుణలను నియమించింది. కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ప్రత్యేక ఇన్చార్జిలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ కోసం పనిచేయనున్నారు. పాతబస్తీ వెలుపల ఎక్కువ సీట్లు సాధించాలన్న లక్ష్యంతో బీజేపీ రంగంలోకి దిగుతోంది. బుధవారం(నవంబర్ 18) గ్రేటర్ బీజేపీ ఎన్నికల ఇన్చార్జి భూపేంద్ర యాదవ్ హైదరాబాద్ రానున్నారు. హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీక... భూపేంద్ర సమక్షంలో బీజేపీలో చేరనున్నారు.
Recommended Video
జనసేనతో పొత్తు...?
ఎన్నికల్లో జనసేనతో బీజేపీ పొత్తుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికైతే జనసేన పోటీపై బీజేపీకి ఎటువంటి సమాచారం లేదని తెలుస్తోంది. ఎన్నికల్లో రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని బీజేపీ భావిస్తోంది. కాబట్టి ఒకవేళ జనసేన పోటీకి సై అంటే ఉమ్మడిగా పోటీ చేసే అవకాశం ఉంది. దుబ్బాకలో గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో హైదరాబాద్లోనూ సత్తా చాటాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. దుబ్బాకలో ప్రదర్శించిన దూకుడునే ఇక్కడ కూడా కొనసాగించాలని... గ్రేటర్లో కాషాయ జెండా ఎగిరేయాలని భావిస్తోంది.