రెండు గంటల్లో దారుసలాంను కూల్చేస్తాం... పక్కా పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తాం... బండి సంజయ్
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. పదునైన,ఘాటైన వ్యాఖ్యలతో నేతలు ప్రత్యర్థులకు సవాళ్లు,ప్రతిసవాళ్లు విసురుతున్నారు. ప్రధానంగా టీఆర్ఎస్-బీజేపీ-ఎంఐఎం ఈ మూడు పార్టీల నేతల మధ్యే మాటల యుద్దం జరుగుతోంది. తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలతో ఎంఐఎంపై విరుచుకుపడ్డారు. పాతబస్తీపై పక్కా సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామన్న సంజయ్... అవసరమైతే దారుసలాంను కూల్చివేస్తామన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం(నవంబర్ 25) బల్కంపేట రోడ్ షోలో బండి సంజయ్ ప్రసంగించారు.
అక్బరుద్దీన్కు బండి సంజయ్ కౌంటర్...
పాతబస్తీ ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ... అక్రమ కట్టడాలు,పేదల ఇళ్లు కూల్చేస్తామని చెప్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం... హుస్సేన్ సాగర్ కట్టపై ఉన్న పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ సమాధులను కూడా కూల్చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు 4700 ఎకరాలున్న హుస్సేన్ సాగర్ ఇప్పుడు 700 ఎకరాలు కూడా లేదన్నారు. అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలకు బల్కంపేట రోడ్ షోలో బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. హిందువులకు గర్వకారణమైన పీవీ సమాధిని,ప్రజా నాయకుడు ఎన్టీఆర్ సమాధిని కూల్చే దమ్ముందా అని ఎంఐఎంకు సవాల్ విసిరారు.
అవసరమైతే దారుసలాంను కూల్చివేస్తాం...: బండి సంజయ్
ఒకవేళ ఆ ఇద్దరి విగ్రహాలను ఎంఐఎం కూల్చివేస్తే... ఆ తర్వాత రెండు గంటలకే తాము దారుసలాంను కూల్చివేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఇండియా గెలిస్తే నల్లజెండాలతో నిరసన ప్రదర్శన చేసేవాళ్లు పాతబస్తీలో ఉన్నారని... అలాంటివాళ్లపై పక్కా సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని అన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపై కూడా మీడియా చర్చ పెట్టాలన్నారు. పాతబస్తీకి వచ్చి నల్ల బిల్లు,విద్యుత్ బిల్లు,ఇంటి పన్ను వసూలు చేసే దమ్ము కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందా అని బహదూర్పురా ఎంఐఎం ఎమ్మెల్యే సవాల్ విసురుతున్నారని గుర్తుచేశారు. మరో ఎంఐఎం ఎమ్మెల్యే పాతబస్తీకి అసదుద్దీన్ ఒవైసీనే సీఎం అని.. ఆయన అనుమతి లేకుండా కేసీఆర్ కూడా అక్కడ అడుగుపెట్టలేడని మాట్లాడినట్లు గుర్తుచేశారు.
హిందువులంతా బీజేపీని గెలిపించాలని...
ప్రగతి భవన్ స్క్రిప్టునే ఎంఐఎం దారుసలాంలో చదువుతోందని బండి సంజయ్ ఆరోపించారు.అందుకే దారుసలాంలో సౌండ్ చేస్తే ప్రగతి భవన్లో రీసౌండ్ వస్తోందన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నా ముఖ్యమంత్రి స్పందించట్లేదన్నారు. కేసీఆర్కు ఎంఐఎం అంటే భయమన్నారు. ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రభుత్వం సామాన్యులపై భారం మోపిందని... అది రద్దు కావాలంటే గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని గెలిపించాలని బండి సంజయ్ అన్నారు.బిహార్లో కేవలం 12శాతం ఉన్న ముస్లింలు ఎంఐఎంను 5 స్థానాల్లో గెలిపించారని... హైదరాబాద్లో ఉన్న హిందువులంతా ఓటు బ్యాంకుగా మారి బీజేపీని గెలిపించాలని సంజయ్ పిలుపునిచ్చారు.
ప్రతీ పైసా కేంద్రానిదే...
రాష్ట్రానికి వస్తున్న ప్రతీ పైసా కేంద్రం ఇస్తున్నదే అన్నారు సంజయ్. పథకాలకు పేర్లు మార్చి,ఫోటోలు మార్చి రాష్ట్ర ప్రభుత్వం తమ పేరిట ప్రచారం చేసుకుంటోందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 2లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేసిందన్నారు.అందులో 1,40,000 ఇళ్లు ఒక్క హైదరాబాద్ నగరానికే కేటాయించారని గుర్తుచేశారు. అలాగే హైదరాబాద్లో రోడ్లు,కమ్యూనిటీ హాల్స్,ఆఖరికి శ్మశాన వాటికల కోసం కేంద్రమే రూ.3500 కోట్లు కేటాయించిందన్నారు. కేంద్ర ప్రభుత్వ వాటా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలేవో టీఆర్ఎస్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ప్రజలు వరద కష్టాల్లో ఉంటే సీఎం కేసీఆర్ ఫాంహౌస్కి పరిమితమయ్యారని మండిపడ్డారు. బాధిత కుటుంబాలకు రూ.10వేలు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్కు రూ.65వేల కోట్లు ఖర్చు చేసినట్లు టీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతోందని... అదే నిజమైతే నగరంలో రోడ్ల పరిస్థితి అద్వాన్నంగా ఎందుకు ఉందని ప్రశ్నించారు.