జీహెచ్ఎంసీలో బీజేపీ గెలుపు.. కేసీఆర్ సర్కారుకు ముగింపు: జేపీ నడ్డా, రాజాసింగ్ ర్యాలీలో ఉద్రిక్తత
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే సమయం ఆసన్నమైందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి పెద్ద ఎత్తున విజయం అందించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.
కేసీఆర్ గద్దె దిగే సమయం ఆసన్నమైంది..
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తపేట నుంచి నాగోలు వరకు నిర్వహించిన రోడ్ షోలో నడ్డా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలోకి దూసుకెళ్తోందన్నారు. రోడ్ షోకు ప్రజలు భారీగా తరలివచ్చి కేసీఆర్ గద్దె దిగే సమయం ఆసన్నమైందనే సంకేతాలిచ్చారని జేపీ నడ్డా వ్యాఖ్యానించారు.
కమల వికాసం అభివృద్ధికి మార్గం..
గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించి హైదరాబాద్ అభివృద్ధికి మార్గం సుగమం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి డివిజన్లోనూ కమల వికాసానికి అందరూ కృషి చేయాలన్నారు. వర్షం కారణంగా రోడ్ షోను మధ్యలోనే ముగించారు. అనంతరం తాజ్ బంజారా హోటల్ లో నిర్వహించనున్న మేధావుల సదస్సుకు జేపీ నడ్డా బయల్దేరి వెళ్లారు. జేపీ నడ్డాతోపాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, పలువురు సీనియర్ నేతలు ప్రచారంలో పాల్గొన్నారు.
జీహెచ్ఎంసీలో బీజేపీ గెలుపు.. కేసీఆర్ సర్కారుకు ముగింపే
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు.. తెలంగాణలో కేసీఆర్ సర్కారుకు ముగింపేనని జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. అంతకుముందు హైదరాబాద్ వచ్చిన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న జేపీ నడ్డాకు ఎమ్మెల్యే రాజాసింగ్, పెద్దిరెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ స్వాగం పలికారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ ఆ పార్టీ బడా నేతలతోనూ ప్రచారం చేయిస్తున్న విషయం తెలిసిందే.
రాజాసింగ్ రోడ్ షోలో ఉద్రిక్తత..
ఇది ఇలావుండగా, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. శుక్రవారం కేపీహెచ్బీ కాలనీ నుంచి రాజాసింగ్ రోడ్ షో ప్రారంభమైంది. బాలాజీనగర్ డివిజన్లో రోడ్ షో కొనసాగుతున్న సమయంలో అదే దారిలో వచ్చిన టీఆర్ఎస్ నాయకులు పోటాపోటీగా నినాదాలు చేశారు. బీజేపీ నాయకులు వెనక్కివెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. బీజేపీ శ్రేణులు కూడా ప్రతి నినాదాలు చేశాయి. ఎన్నికలప్రచారంలో పాల్గొన్న నేతలను వెనక్కి వెళ్లిపోవాలని టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడం సరికాదని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింపజేశారు.