దిశ నిందితుల మృతదేహాలు కుళ్లిపోయాయి: హైకోర్టుకు చెప్పిన గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్
ఎన్ కౌంటర్ జరిగి 15 రోజులైనా దిశ నిందితుల మృతదేహాల అప్పగింత ప్రక్రియ కొలిక్కిరాలేదు. దీనిపై శుక్రవారం హైకోర్టులో వాడీవేడీ విచారణ జరిగింది. దిశ కేసులో నిందితులైన నలుగురు యువకులు ఈ నెల 6న షాద్ నగర్ సమీపంలోని చటాన్ పల్లి వద్ద పోలీసుల కాల్పుల్లో చనిపోయారు. ఎన్కౌంటర్పై అనుమానం వ్యక్తంచేస్తూ... ఈ నెల 17న మహిళా సంఘాలు సుప్రీంకోర్టుకు వెళ్లాయి. ఐతే.. మృతదేహాలను భద్రంగా ఉంచాలన్న సుప్రీంకోర్టు.. ఈ వ్యవహారాన్ని హైకోర్టే తేల్చిచెప్పాలని ఆదేశించింది. దీంతో చీఫ్ జస్టిస్ ఆర్ ఎస్ చౌహాన్ ఆధ్వర్యంలోని బెంచ్ ఈ కేసును పరిశీలిస్తున్నది.
దిశ నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం, అవసరం లేదన్న ఏజీ, చేయాల్సిందేనంటోన్న హైకోర్టు
ఇంకొన్ని రోజుల్లో పూర్తిగా కుళ్లిపోతాయి
శుక్రవారం నాటి విచారణలో గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్ కోర్టుకు హాజరై నాలుగు మృతదేహాల పరిస్థితిని కోర్టుకు వివరించారు. మైనస్ రెండు డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత ఉండే ఫ్రీజర్ లో నాలుగు మృతదేహాలను ఉంచామని, రకరకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోయిందని, శుక్రవారం ఉదయం నాటికి నాలుగు డెడ్ బాడీలు 50 శాతం కుళ్లిపోయాయని డాక్టర్ శ్రవణ్ తెలిపారు. వాటిని అలాగే ఉంచితే ఇంకో వారం పదిరోజుల్లో పూర్తిగా కుళ్లిపోతాయని చెప్పారు.
డెడ్ బాడీల్ని భద్రపర్చే సౌకర్యం లేదా?
గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ చెప్పిన సమాధానాల్ని విన్న జడ్జిలు... దేశంలో మరే ఇతర ఆస్పత్రిలోనైనా డెడ్ బాడీల్ని ప్రిజర్వ్ చేసే సౌకర్యాలు ఉన్నాయా? ఈ నాలుగు మృతదేహాలను అక్కడికి తరలించేందుకు వీలవుతుందా? అని ప్రశ్నించారు. అందుకు డాక్టర్ శ్రవణ్.. వేరే ఆస్పత్రుల్లో సౌకర్యాల గురించి తనకు తెలియదని జడ్జిలకు చెప్పారు. విచారణ కొనసాగుతున్న ఈ కేసుపై జడ్జిలు నిర్ణయాన్ని వెలువరించాల్సి ఉంది.
నిందితుడి భార్య వయసు 13 ఏండ్లు?
దిశ నిందితుల్లో ఒకరైన చింతకుంట చెన్నకేశవులు భార్య వయసుపై సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. మొదటి నుంచీ పోలీసులు అనుమానిస్తున్నట్టుగానే.. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న ఆమె మైనర్ అని, వయసు 13 ఏండ్లేనని తెలుస్తున్నది. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా అధికారులు సేకరించినట్లు సమాచారం. చెన్నకేశవులుతో ప్రేమ వివాహం తర్వాత అత్తారింట్లోనే ఉంటున్న ఆమె.. భర్త ఎన్ కౌంటర్ పై అనుమానాలు వ్యక్తం చేశారు.