భూమా అఖిలప్రియ బెయిల్: న్యాయస్థానం కీలక నిర్ణయం: 48 గంటలు: విజయవాడ ఘటనతో చిక్కుల్లో
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీమంత్రి భూమా అఖిలప్రియ బెయిల్ పిటీషన్ మళ్లీ వాయిదా పడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయిన్పల్లి కిడ్నాప్ ఉదంతంలో ప్రధాన నిందితురాలిగా ఆమె ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు. పోలీసుల అదుపులో ఉన్నారు. అనారోగ్య కారణాలను చూపుతూ..తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆమె దాఖలు చేసిన పిటీషన్పై విచారణను సికింద్రాబాద్ న్యాయస్థానం సోమవారం నాటికి వాయిదా వేసింది.
భూమా అఖిల ప్రియకు బెయిల్ పిటీషన్పై కోర్టు కీలక ఆదేశాలు జారీ: కీలకంగా మారిన ఆ రిపోర్ట్
ఇదివరకు ఆమె బెయిల్ పిటీషన్ను దాఖలు చేసినప్పటికీ.. న్యాయస్థానం దాన్ని తోసి పుచ్చింది. పోలీసుల కస్టడీకి అప్పగించింది. తొలుత న్యాయస్థానం విధించిన మూడు రోజుల కస్టడీ 13వ తేదీ నాటికి ముగిసింది. కస్టడీ ముగిసిన అనంతరం ఆమెను పోలీసులు చంచల్గూడ కారాగారానికి తరలించారు. అదే సమయంలో అఖిల ప్రియకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆమె తరఫు న్యాయవాది సికింద్రాబాద్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
ఈ పిటీషన్పై సికింద్రాబాద్ న్యాయస్థానం విచారణ చేపట్టింది. వాదోపవాదాలను ఆలకించింది. అఖిలప్రియ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలని న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. పోలీసులు కూడా కౌంటర్ పిటీషన్ను దాఖలు చేశారు. తమకు మరి కొంతకాలం పాటు కస్టడీకి అప్పగించాలని కోరారు. కిడ్నాప్ కేసులో కొంత కీలక సమాచారాన్ని సేకరించాల్సి ఉందని పేర్కొన్నారు. అనంతరం న్యాయస్థానం..తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
బోయిన్పల్లి కిడ్నాప్ వ్యవహారంలో విజయవాడకు చెందిన సిద్ధార్థ్ అనే వ్యక్తి ప్రమేయం కూడా ఉన్నట్లు తేలడంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. తవ్వుతున్న కొద్దీ కొత్త పేర్లు వెలుగులోకి వస్తుండటంతో భూమా అఖిల ప్రియ బెయిల్ లభించే అవకాశాలు మరింత క్లిష్టతరమౌతోన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. సిద్దార్థ్.. విజయవాడ నుంచి 15 మంది మనుషులను కిడ్నాప్ కోసం హైదరాబాద్కు పంపించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.