కిడ్నాప్ కేసులో ట్విస్ట్: జగత్కు ఉచ్చు -మళ్లీ జైలుకు అఖిలప్రియ -ఆమె క్లూతో సోదరుడు బుక్?-పరారీలోనే భర్త
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో మాస్టర్ మైండ్ గా ఆరోపణలు ఎదుర్కొంటూ, కేసులో ఏ1 ముద్దాయిగా ఉన్న టీడీపీ నాయకురాలు, ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు మళ్లీ షాక్ తగిలింది. కిడ్నాప్ కేసులో బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన జడ్జి.. ఆమెను తిరిగి జ్యూడీషియల్ రిమాండ్ కు పంపేశారు. మరోవైపు అఖిల తమ్ముడు జగత్ మెడకూ ఉచ్చుబిగించేలా పోలీసులు కీలక అడుగులు వేస్తున్నారు. ఆమె భర్త భార్గవ్ రామ్ ఇంకా పరారీలోనే ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు..
Recommended Video
మోదీ సాబ్.. మా బాకీ ఇప్పించండి -ఇబ్బందుల్లో ఉన్నాం -కేంద్రానికి హైదరాబాద్ నిజాం మనవడి విజ్ఞప్తి
కోర్టుకు సెలవు.. జడ్జి ఇంటికి..
కిడ్నాప్ కేసులో కింగ్ పిన్, మాజీ మంత్రి అఖిలప్రియకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన దరిమిలా, మధ్యలో మూడు రోజులు ఆమెను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. పోలీస్ కస్టడీ బుధవారంతో ముగియగా, గురువారం ఆమెను సికింద్రాబాద్ కోర్టుకు తరలించాల్సిఉండగా, సెలవు కారణంగా గురువారం ఆమెను న్యాయమూర్తి నివాసంలో హాజరుపర్చారు. 3 రోజుల విచారణ స్టేట్మెంట్ను న్యాయమూర్తికి పోలీసులు అందజేశారు.
16 తర్వాతే బెయిల్పై విచారణ
కస్టడీలో భాగంగా బేగంపేట మహిళా పీఎస్లో 3 రోజులు అఖిలప్రియను పోలీసులు ప్రశ్నించారు. అనంతరం ఆమెకు బేగంపేట్ పాటిగడ్డ హెల్త్ కేర్ సెంటర్లో కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆమెకు నెగెటివ్గా తేలింది. అనంతరం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈసీజీ, చెస్ట్ ఎక్స్రే, గైనకాలజి డిపార్ట్మెంట్లో పరీక్షలు నిర్వహించారు. న్యూరాలజీ వైద్యులు పరీక్షలు జరిపారు. జడ్జి ఎదుట హాజరు అనంతరం ఆమెను చంచల్గూడ జైలుకు తరలించారు. బెయిల్ ఇవ్వాలని అఖిలప్రియ తరపు న్యాయవాదులు కోరారు. కానీ బెయిల్ పిటిషన్పై 16వ తేదీన న్యాయస్థానం విచారణ జరపనుంది. మరోవైపు..
జగత్పై ఎఫ్ఐఆర్ నమోదు?
బోయినపల్లి కిడ్నాప్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. అఖిలప్రాయ సోదరుడు జగత్ పాత్రపై పోలీసుల దర్యాప్తు ఫైనల్ దశకు చేరింది. కిడ్నాప్ వ్యవహారంలో జగత్ ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు సేకరించారు. కస్టడీలో అఖిలప్రియ చెప్పిన కీలక విషయాలతోపాటు, జగత్ విఖ్యాత్ కారు డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు ఈ కేసులో జగత్ ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. సీసీ ఫుటేజీ, కాల్ డేటా ఆధారంగా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇది అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.
అవి చూపడంతో అఖిల షాక్..
మూడు రోజుల విచారణలో భాగంగా అఖిలప్రియను ప్రశ్నించిన పోలీసులు భూవివాదానికి సంబంధించి కీలక వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ప్రయత్నించినా... ప్రవీణ్ రావు సోదరుల నుంచి స్పందన లేకపోవడంతో అపహరణకు పాల్పడినట్లు అఖిలప్రియ పోలీసుల వద్ద తెలిపినట్టు సమాచారం. మొదట అపహరణకు సంబంధించిన ఏ విషయాన్ని ప్రశ్నించినా.... తనకు తెలియదని దాటవేసిన అఖిలప్రియయ, పోలీసులు చూపించిన ఆధారాలతో ఒక్కొక్కటిగా నిజాలు ఒప్పుకున్నట్లు సమాచారం. భార్గవ్ రామ్, జగత్ విఖ్యాత్ రెడ్డి కూడా బోయిన్ పల్లి వెళ్లి అపహరణను ప్రత్యక్షంగా పర్యవేక్షించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరించారు.
ఆ ముగ్గురిని అరెస్టు చేస్తేనే..
బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో భార్గవ్ రామ్, జగత్ విఖ్యాత్ రెడ్డి, గుంటూరు శ్రీనులను అదుపులోకి తీసుకుంటే మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంది. పరారీలో ఉన్నవారి కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. హఫీజ్ పేటలో భూమా నాగిరెడ్డికి చెందిన దాదాపు 33 ఎకరాల భూమిని ఆయన బినామీ ఏవీ సుబ్బారెడ్డి పర్యవేక్షించేవారు. 2005లో కృష్ణారావు అనే న్యాయవాదిని న్యాయసలహాదారుగా నియమించుకున్నారు.
న్యాయవాది కృష్ణారావు మరణంతో... ఆయన కుమారుడు ప్రవీణ్ రావు, మేనల్లుడు సునీల్ రావు బాధ్యతలు తీసుకున్నారు. ఈ భూమి విషయంలో పలు న్యాయ వివాదాలు ఉండటంతో 2015లో ఏవీ సుబ్బారెడ్డి... ప్రవీణ్ రావు సోదరుల నుంచి నగదు తీసుకొని బయటికి వెళ్లిపోయాడు. ఈ విషయం అఖిల ప్రియకు తెలియడంతో కొంత కాలంగా ప్రవీణ్ రావుతో పాటు వాళ్ల భాగస్వాములపై ఒత్తిడి తెచ్చారు. భూమా నాగిరెడ్డికి చెందిన భూమిని ఎలా సొంతం చేసుకుంటారని, వాటా ఇవ్వాల్సిందిగా కోరింది. నిరాకరించడంతో అపహరణ చేసి... బలవంతంగా భూమిని రాయించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు దొరికిపోయారు.