బీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్.. పోలీసుల ప్రయత్నం విఫలం.. పట్టిస్తే లక్ష పారితోషికం..!
హైదరాబాద్ : హయత్ నగర్లో బీఫార్మసీ విద్యార్థిని సోని కిడ్నాప్ కేసు ఇంకా కొలిక్కి రాలేదు. ఆమె జాడ కనిపించకుండా పోయి వారం రోజులు అవుతున్నా పోలీసుల దర్యాప్తులో ముందడుగు పడలేదు. మాయమాటలతో సోని కుటుంబ సభ్యులను ట్రాప్ చేసిన నిందితుడు పక్కా ప్లాన్డ్గా వ్యవహరించాడు.
కిడ్నాప్ సమయంలో వాడింది కూడా సొంత కారు కాదు. దాంతో ఈ కేసు దర్యాప్తు చిక్కుముడి వీడటం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే టెక్నాలజీ సాయంతో కిడ్నాపర్ మూలాలు పసిగట్టినా.. అతడు ఎక్కడున్నాడో అనేది ఇంతవరకు అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. ఆ క్రమంలో నిందితుడిని పట్టిస్తే లక్ష పారితోషకం ప్రకటించడం చర్చానీయాంశమైంది.
సహ జీవనంలో మరొకడు ఎంట్రీ.. ఆమెకు దగ్గరయ్యాడని హత్య..!
బీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్ కేసు.. వారం రోజులాయే జాడ లేక..!
హైదరాబాద్ శివారులోని హయత్ నగర్కు చెందిన బీఫార్మసీ విద్యార్థిని సోని కేసు మిస్టరీగా మారింది. గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేశాడని కేసు నమోదు చేసుకున్న రాచకొండ పోలీసులు ఆ తర్వాత నిందితుడికి సంబంధించి కొన్ని వివరాలు సేకరించారు. అతడి స్వస్థలం, నేపథ్యం అన్నీ వివరాలు కనుక్కున్నప్పటికీ కిడ్నాప్ చేసిన యువతితో ఎక్కడకు వెళ్లాడనేది ప్రశ్నగా మిగిలింది. దాంతో ఈ కేసును రాచకొండ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నిందితుడి వేటలో తలమునకలయ్యారు. అయినా కూడా అతడు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నాడు.
ఈ నెల 23వ తేదీ మంగళవారం నాడు కల్లిబొల్లి మాటలు చెప్పి సోని తండ్రి యాదయ్యను ముగ్గులోకి దించాడు. టీ కొట్టు నడుపుతూ జీవనం సాగిస్తున్న యాదయ్య దగ్గరకు శ్రీధర్ రెడ్డి పేరుతో వచ్చాడు. టీ తాగుతూ యాదయ్య ఫ్యామిలీ నేపథ్యం గురించి ఆరా తీశాడు. ఆ క్రమంలో తన పెద్దకూతురు సోనికి ఉద్యగం ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. అంతేకాదు అప్పటికప్పుడు వారి కుటుంబంతో చనువు పెంచుకుని సోనితో పాటు యాదయ్యను తన కారులో ఎక్కించుకుని బయల్దేరాడు.
కారు నెంబర్లు మారుస్తూ.. పోలీసులకు సవాల్ విసురుతూ..!
దాదాపు 7-8 గంటలు వారిద్దరినీ కారులో నగరమంతా తిప్పిన నిందితుడు అదే రోజు రాత్రి 8 గంటల సమయంలో సోనికి సంబంధించిన సర్టిఫికెట్స్ జిరాక్స్ తీసుకురావాల్సిందిగా యాదయ్యను కోరాడు. ఆ క్రమంలో ఆయన కారు దిగి అలా వెళ్లగానే సోనితో సహా ఉడాయించాడు. అయితే ఈ కేసులో సీసీ ఫుటేజ్ను కీలకంగా మలుచుకున్న పోలీసులు వాడు వాడుతున్న కారును గుర్తించారు. ఆ కారు నెంబరుతో యజమాని వివరాలు కనుక్కుని ఆరా తీయగా చోరీకి గురైనట్లు తెలిసింది. దాంతో పోలీసులకు ఈ కేసు క్లిష్టతరంగా మారింది.
కారును ట్రేస్ చేస్తూ ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న పోలీసులకు సదరు నిందితుడు తలనొప్పిలా మారాడు. కారు నెంబర్ మారుస్తూ దొరక్కుండా తప్పించుకుంటున్నట్లు నిర్దారించారు. రెండు రోజుల కిందట కర్నూలు, కడప జిల్లాల్లో తిరిగినట్లు కొంత ఇన్ఫర్మేషన్ రావడంతో ఆ దిశగా కూడా రాచకొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో 26 కేసులు.. తొలిసారి యువతి కిడ్నాప్
బీభత్సమైన నేర చరిత్ర కలిగిన పాత నేరస్థుడు రవిశేఖర్ ఈ కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరుకు చెందిన పాతనేరస్థుడిగా నిర్ధారణకు వచ్చారు. అతడిపై ఏపీలోని విజయవాడ, గుంటూరు జిల్లాలతో పాటు తెలంగాణలోని నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో 26 చోరీ కేసులు ఉండటంతో రాచకొండ పోలీసులు మరింత అలర్టయ్యారు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే రవిశేఖర్కు నేరచరిత్ర ఉన్నప్పటికీ యువతిని అపహరించడం మాత్రం ఇదే తొలిసారని తేలడం ఆందోళనకు గురిచేస్తోంది.
ఈ కిడ్నాప్ కేసులో నిందితుడు రవిశేఖర్ ఆచూకీ తెలిపినవారికి లక్ష రూపాయల పారితోషకం ఇవ్వనున్నట్లు రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ ప్రకటించారు. ఆ మేరకు నిందితుడికి సంబంధించిన ఫోటోలతో పాటు అతడు వాడుతున్న కారుకు సంబంధించిన ఫోటోలు కూడా మీడియాకు రిలీజ్ చేశారు. అతడి గురించి జాడ తెలిస్తే రాచకొండ కంట్రోల్ రూమ్లోని 9494721100 నెంబరుకు గానీ.. కమిషనరేట్ వాట్సాప్ నెంబర్ 9490617111.. హయత్ నగర్ ఇన్స్పెక్టర్ నెంబర్ 9490617161 కు గానీ సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు.
నలుగురి భార్యల ముద్దుల మొగుడు.. గంగాధర ఏందీ కథ..!
పట్టిస్తే లక్ష పారితోషకం.. తల్లిదండ్రుల్లో భయాందోళన
అదలావుంటే టెక్నాలజీ సాయంతో ఇలాంటి కేసులెన్నో చేధించిన పోలీసులకు ఈ కేసు తలనొప్పిలా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. కిడ్నాప్ జరిగి వారం రోజులవుతున్నా.. కొన్ని కీలక ఆధారాలు దొరికినా.. కేసు చిక్కుముడి మాత్రం విప్పలేకపోతున్నారనే ఆరోపణలున్నాయి. పోలీసులకు సవాల్ విసురుతున్నట్లుగా నిందితుడు ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతున్నాడనే టాక్ నడుస్తోంది.
నిందితుడి ఆచూకీ తెలిపితే లక్ష రూపాయల నజారానా ప్రకటించడం చూస్తుంటే.. తాము పట్టుకోలేకే పోలీసులు చివరికి ఈ నిర్ణయం తీసుకున్నారనే వాదన లేకపోలేదు. వారం రోజుల నుంచి తమ కూతురు జాడ కనిపించక ఆమె తల్లిదండ్రులు బిక్కుబిక్కుమని కాలం వెళ్లదీస్తున్నారు. తమ కూతురు క్షేమంగా ఉందో లేదో తెలియక కన్నీరుమున్నీరవుతున్నారు.