కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఇంట్లో దొంగతనం - భారీగా నగదు, నగలు మాయం
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి నివాసంలో దొంగతనం జరిగింది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్లో గల ఆమె నివాసంలో రూ. 3 లక్షల నగదు, మరో మూడున్నర లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ మేరకు రేణుకా చౌదరి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
మాజీ ఎంపీ ఫిర్యాదు చేసిన మేరకు మంగళవారం రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, తమ ఇంట్లోనే ఇంట్లో పనిచేసే ముగ్గురు వ్యక్తులపై అనుమానం ఉందని రేణుక తన ఫిర్యాదులో పేర్కొనడంతో వాళ్లను కూడా పోలీసులు ప్రశ్నించారు.
రేణుకా చౌదరి ఫిర్యాదులో పేర్కొన్నట్లు నిజంగా ఇంట్లోవాళ్లే చోరీకి పాల్పడ్డారా? లేక బయటి నుంచి ఎవరైనా చొరబడ్డారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు రేణుక చౌదరి నివాసంతోపాటు స్థానిక సీసీటీవి ఫుటేజీలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.