ఆర్టీసీ బస్సును హైజాక్ చేసిన అజ్ఞాతవాసి.. భయాందోళనకు గురైన ప్రయాణికులు, ఏమైందంటే..?
వికారాబాద్: విమానాల హైజాక్ గురించి విన్నాం.. బైకులు ఎత్తుకెళ్లే వారిగురించి విన్నాం. ఇక కార్లను కూడా దొంగతనం చేసి మరో రాష్ట్రంలో అమ్మే వారిని చూశాం. కానీ బస్సులను అది కూడా ఆర్టీసీ బస్సులను ఎత్తుకెళ్లే వారి గురించి చాలా అరుదుగా విని ఉంటాం. అవును ఇప్పుడు మీరు చదవబోయే వార్త కూడా ఇలాంటిదే. బస్టాండులో ఉన్న బస్సును ఓ వ్యక్తి హైజాక్ చేశాడు.
వికారాబాద్ జిల్లాలో బస్సు హైజాక్కు గురైంది. ఆదివారం రాత్రి ఈ బస్సును ఓ వ్యక్తి హైజాక్ చేసినట్లు తెలుస్తోంది. బస్సును హైజాక్ చేసిన వ్యక్తి వికారాబాద్ జిల్లాకు 10 కిలోమీటర్ల దూరంలో వదిలి వెళ్లిపోయాడు. ఆ సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. పల్లె వెలుగు బస్సును బస్టాండ్లో వదిలి డ్రైవర్ కండక్టర్ కాస్త సేదదీరుదామని బయటకు వెళ్లారు. ఆ సమయంలోనే ఓ గుర్తు తెలియని వ్యక్తి బస్సు డ్రైవర్ దగ్గర ఉన్న తలుపును తీసి బస్సులోకి ఎక్కాడు. బస్సును స్టార్ట్ చేసి కదిలించి ముందుకు తీసుకెళ్లాడు. ప్రయాణికులంతా బస్సును నడిపేది ఆ బస్సు డ్రైవరే అని భావించారు.
ఇక ఇలా బస్సును 10 కిలోమీటర్లు నడిపి దారి మధ్యలో బస్సును ఆపివేశాడు. ఇంకా అప్పటికీ ప్రయాణికులకు బస్సు నడిపింది మరో వ్యక్తి అని తెలియదు. బస్సును చాలా సేపు అక్కడే రోడ్డు మధ్యలో నిలిపివేయడంతో ప్రయాణికులకు అనుమానం వచ్చింది. వెళ్లి చూడగా డ్రైవర్ సీటులో ఎవరూ లేరు. అదే సమయంలో కండక్టర్ కోసం చూడగా కండక్టర్ కూడా బస్సులో లేడు. బస్సు నడిపిన ఆ అజ్ఞాత వ్యక్తి మాత్రం బస్సు దిగి అలా నడుచుకుంటూ వెళ్లిపోయాడు.
ప్రయాణికులు ఆ అజ్ఞాత వ్యక్తిని వెనక్కు రావాల్సిందిగా పిలిచారు. చూస్తుండగానే చిమ్మ చీకటిలో కనిపించకుండా పోయాడు ఆ వ్యక్తి. ఇక బస్టాండులో బస్సు కనిపించకపోవడంతో కంగారు పడిపోయిన బస్సు డ్రైవరు కండక్టర్లు ఆ బస్సు ఎటుగా వెళ్లిందో తెలుసుకుని అక్కడికి వెళ్లారు. దారి మధ్యలో బస్సు నిలిచిపోయి ఉండటం గమనించారు. బస్సును ఎక్కి తిరిగి గమ్యస్థానంకు తీసుకెళ్లాడు డ్రైవర్. అంతకుముందు తాండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.