కేసీఆర్ ఢిల్లీలో బొంగరం కూడా తిప్పలేరు.. 2023లో అధికారం మాదే : లక్ష్మణ్
హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల వేళ సారు.. కారు.. పదహారు అంటూ పార్లమెంటరీ స్థానాల్లో క్లీన్ స్విప్పై ఆశలు పెట్టుకున్నారు టీఆర్ఎస్ నేతలు. ప్రచారంలో ఆ ట్యాగ్ లైన్ను బాగానే ఉపయోగించినా వర్కవుట్ కాలేదు. అయితే ఫలితాలు వచ్చేనాటికి సీన్ రివర్సయింది. కేవలం తొమ్మిది స్థానాలకే పరిమితమైంది. అటు బీజేపీ నాలుగు స్థానాల్లో విజయఢంకా మోగించడంతో ఆ పార్టీశ్రేణుల్లో ఎక్కడా లేని ఉత్సాహం కనిపిస్తోంది. అదలావుంటే తాజాగా బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు చర్చానీయాంశంగా మారాయి.
2023లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాగా వేస్తామంటున్నారు లక్ష్మణ్. ఈ ఐదేళ్లల్లో పార్టీని బలోపేతం చేసి అధికారం దిశగా అడుగులు వేస్తామంటున్నారు. 2023లో బీజేపీకి విజయం తథ్యమని.. ఎట్టిపరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్ పలు అంశాలను ప్రస్తావించారు.
కిషన్ రెడ్డి లక్ : హెంగార్డుల కోసం పోరాడారు.. హోం మంత్రి అయ్యారు
మొన్నటి లోక్సభ ఎన్నికల్లో కారు పల్టీ కొట్టిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ బలం పుంజుకున్నదని చెప్పడానికి ఉత్తర తెలంగాణలో మూడు స్థానాలు కైవసం చేసుకోవడమే దానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. సారు..కారు.. పదహారు అంటూ టీఆర్ఎస్ నేతలు తెగ హడావిడి చేసినప్పటికీ.. సారూ మీతో బేజారు అంటూ ప్రజలు తిప్పికొట్టారని వంగ్యాస్త్రాలు సంధించారు. కారు పంక్చర్ కావడంతో టీఆర్ఎస్ కనుమరుగవడం ఖాయమని చెప్పుకొచ్చారు.
తెలంగాణలో 16 స్థానాలు టీఆర్ఎస్.. ఒకటి ఎంఐఎం సాధించి ఢిల్లీలో చక్రం తిప్పుతానని కలలుగన్న కేసీఆర్ ఇప్పుడేమంటారని ప్రశ్నించారు. ఇప్పటికైనా తండ్రీకొడుకులైన కేసీఆర్, కేటీఆర్కు అహంకారం తగ్గాలని.. కాళ్లు గాల్లో తేలకుండా భూమిపై పెట్టేటట్లు చూసుకోవాలని హితవు పలికారు. ఏదో ఊహాగానాల్లో విహరిస్తూ ఢిల్లీలో చక్రం కాదు కదా కనీసం బొంగరం కూడా తిప్పలేరంటూ ఎద్దేవా చేశారు.