క్యాబినెట్ రీ-షఫుల్.. కేసీఆర్ సర్కారులోకి కొత్త మంత్రులు..?మహిళా కోటాలో ఆమె గ్యారెంటీ..?
హైదరాబాద్ : తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు సర్కారులోకి కొత్త మంత్రులు రాబోతున్నట్టు తెలుస్తోంది. ఆగస్టు 15 నాటికి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, సమర్థులకు చోటిస్తానని, అప్పటి నంచి పూర్తి స్థాయిలో పాలన కొనసాగుతుందని సీఎం చంద్రశేఖర్ రావు లీకులు ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రాన్ని దేశం ఆదర్శంగా తీసుకునేలా సంస్కరణలు చేయబోతున్నట్టు మరో సంచలన ప్రకటన చేశారు. దీనిని మాటలకే పరిమితం చేయకుండా, చేతల్లో చూపిస్తే అందరూ సంతోషిస్తారనే చర్చ తెలంగాణ వ్యాప్తంగా మొదలైంది.
తెలంగాణ మంత్రి వర్గం రీ-షఫుల్..! కొత్త వారికి అవకాశం కల్పించనున్న కేసీఆర్..!!
ఇదిలా ఉండగా, ఇంతకీ సీఎం చంద్రశేఖర్ రావు క్యాబినెట్ లోకి వచ్చే కొత్త మంత్రులెవరు..? చంద్రశేఖర్ రావు మంత్రివర్గంలో ప్రస్తుతానికి బలమైన కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒక్క మంత్రి కూడా లేరు. ఇందు కోసం ఆ సామాజిక వర్గానికి చెందిన సమర్థులపై దృష్టి సారించారు సీఎం చంద్రశేఖర్ రావు. త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్ లోని కమ్మ సామాజిక వర్గం వారిని సంతృప్తిపరిచేందుకు, కమ్మ నేతను మంత్రివర్గంలోకి తీసుకోవాలని కూడా సీఎం చంద్రశేఖర్ రావు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన దృష్టిలో ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్, ఇదే జిల్లాకు చెందిన నేత, పాలేరు నుంచి ఓడిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు..! కమ్మ నేత కోసం కేసీఆర్ అన్వేషణ..!!
వీరిలో ఒకరికి మంత్రివర్గంలో చోటు దక్కవచ్చుననే ఊహాగానాలు తెరమీదకు వచ్చాయి. సీఎం చంద్రశేఖర్ రావు మొగ్గు మాత్రం తుమ్మల వైపే ఉందని తెలుస్తోంది. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. యువ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ కు పార్టీలోని మిగతా సీనియర్ నేతలతో అంతగా సన్నిహిత సంబంధాల్లేవు. ఈయనకు మంత్రి పదవి ఇస్తే, కమ్మ సామాజిక వర్గం మొత్తం ఆమోదించి, హర్షించే పరిస్థితి కూడా లేదు. అందుకే, తుమ్మల నాగేశ్వరరావు వైపు సీఎం చంద్రశేఖర్ రావు మొగ్గుతున్నట్టు తెలుస్తోంది.
ఖమ్మం నుంచి ఆ నేతకు అవకాశం..! సారు గురి ఆయన మీదే..!!
వ్యక్తిగతంగా సీఎం చంద్రశేఖర్ రావు-తుమ్మల అత్యంత సన్నిహితులు. రాజకీయాల్లోనే సీనియరైన తుమ్మల, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు నియోజవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి ( ఇప్పుడు గులాబీ గూటిలో ఉన్నారు) చేతిలో ఓడిపోయారు. టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా నేతలంతా ఈయన మనుషులే. ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరారు. ఆ తరువాతనే, ఆ జిల్లాలో తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ ఎదిగింది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకున్న సీఎం చంద్రశేఖర్ రావు, తుమ్మలను ముందుగా మంత్రి పదవిలోకి తీసుకుని, ఆ తరువాత ఎమ్మెల్సీగా గెలిపించుకోవాలని సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
చేవెళ్ల చెల్లెమ్మకు అవకాశం..! అదే దారిలో మరికొంత మంది కొత్త ముఖాలు..!!
కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డికి మహిళా కోటాలో మంత్రి పదవి ఖాయమైనట్టే. వీరితోపాటు ఇతర సామాజిక వర్గాల నుంచి జోగు రామన్న, గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్... పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. మంత్రివర్గంలోకి కేటీఆర్, హరీష్ రాపుల పునరాగమనం ఖాయమైనట్టేనని కూడా తెలుస్తోంది. సీఎం చంద్రశేఖర్ రావు చెప్పినట్టుగా వీరిలో ఎంతమంది సమర్థులో మీరే ఆలోచించుకోండి, ఎవరికి మంత్రి వర్గంలో చోటుద దక్కుతుందో చూడాలి.