బర్త్ డే పార్టీకి పిలిచి .. కేక్ లో మత్తుమందిచ్చి .. బాలికపై ముగ్గురు మైనర్ బాలురు గ్యాంగ్ రేప్
మానవ మృగాలు రోజురోజుకీ పేట్రేగిపోతున్నాయి. బాలికలు,మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలపై దాడులు చేస్తున్న మృగాళ్ళలో ఏ మాత్రం మార్పు లేదు. నిత్యం దేశంలో ఎక్కడో ఒకచోట అకృత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఒకపక్క హైదరాబాద్ కుండపోత వర్షాలతో అల్లకల్లోలంగా మారిన సమయంలోనూ అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా మైనర్ల అత్యాచార ఘటనలు సభ్య సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నాయి.
స్నేహం ముసుగులో దారుణం .. బాలికకు మత్తు మందిచ్చి గ్యాంగ్ రేప్
తాజాగా హైదరాబాద్లో వెలుగుచూసిన ఘటనలో స్నేహం ముసుగులో ముగ్గురు మైనర్ బాలురు ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. జూబ్లీహిల్స్ చెందిన బాలికకు ముగ్గురు మైనర్ బాలురతో స్నేహం ఉంది. ఈ క్రమంలో బర్త్ డే పార్టీ అని పిలిచిన బాలురు ప్లాన్ ప్రకారం బాలికను హోటల్ కు పిలిచారు. కేక్ పై మత్తు మందు చల్లి ముందు బాలిక చేత తినిపించారు. దీంతో బాలిక మత్తు లోకి జారుకోవడంతో ముగ్గురు బాలురు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.
అపస్మారక స్థితిలోకి వెళ్ళిన బాలిక ... వెలుగులోకి ఘటన
సామూహిక లైంగిక దాడి చేసి, ఆ తర్వాత ఈ విషయం బయట ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. బాలిక తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. దీంతో తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్పించారు. బాలికను గట్టిగా ప్రశ్నించగా తల్లిదండ్రులకు విషయం చెప్పి కన్నీటి పర్యంతం అయ్యింది. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 11వ తేదీన ఈ ఘటన జరగగా బాలిక అస్వస్థతకు గురికావడంతో తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఘటన సైబరాబాద్ పరిధిలో జరగడంతో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి సైబరాబాద్ పోలీసులకు బదిలీ చేశారు.
Recommended Video
కేసు నమోదు చేసిన పోలీసులు .. కొనసాగుతున్న దర్యాప్తు
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడతామని తెలిపారు. బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన ముగ్గురు మైనర్ బాలులను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది.
హత్రాస్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం కాగా ఇప్పటికీ ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి . అప్పటి నుండి ఇప్పటివరకు పలు రాష్ట్రాల్లో బాలికలపై అత్యాచార ఘటనలు నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి . తెలుగు రాష్ట్రాలలో కూడా ఇతర రాష్ట్రాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.