యాదాద్రి జిల్లాలో మొదలైన క్యాంప్ రాజకీయాలు, రేవంత్ రెడ్డి ఇలాఖాలో కాంగ్రెస్ పరాజయం
Recommended Video
మున్సిపోల్స్లో అధికార టీఆర్ఎస్ పార్టీ దూసుకెళ్తోంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం సింగిల్ డిజిట్కే పరిమితమైంది. కానీ టీఆర్ఎస్ విజయం ఆశించిన చోట గెలిచి.. ఆ పార్టీ నేతలను గుక్కతిప్పుకోకుండా చేశారు. నాలుగు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా, మరో రెండు చోట్ల లీడ్లో కొనసాగుతోన్నారు. బీజేపీ ఆమన్గల్లు ఒక చోట మాత్రమే విజయం సాధించింది.
కాంగ్రెస్ విజయం
యాదగిరిగుట్టలో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడింది. మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా.. 9 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు జయకేతనం ఎగరవేశారు. మరోవైపు టీఆర్ఎస్ అభ్యర్థులు ఎక్కడ తమ కౌన్సిలర్లను తీసుకెళతారోనని భయంతో.. కాంగ్రెస్ అభ్యర్థులను రహస్య ప్రాంతానికి తరలించారు. కోస్గి, జనగామలో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు లీడ్లో ఉన్నారు.
కాంగ్రెస్కే మొగ్గు
యాదాద్రి కోసం సీఎం కేసీఆర్ వందల కోట్లు వ్యయం చేసి.. ఆలయాన్ని అద్బుతంగా నిర్మిస్తున్నారు. తెలంగాణ తిరుపతి మాదిరిగా తీర్చిదిద్దుతున్నారు. ఇదే అస్త్రంతో టీఆర్ఎస్ నేతలు ప్రచారం నిర్వహంచినా.. యాదాద్రి ఓటర్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకే జై కొట్టారు. ఇక్కడ ప్రజల తీర్పు కాస్త ఆశ్చర్యం కలిగిస్తోంది.
వడ్డేపల్లిలో విజయం..
గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మొత్తం 10 వార్డులు ఉండగా.. 9 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ఒక్క డివిజన్ గెలవడం విశేషం. ఇటు నారాయణ ఖేడ్ మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 15 వార్డులు ఉండగా 8 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. 7 చోట్ల టీఆర్ఎస్ సభ్యులు గెలిచారు.
ఐజాలో జూపల్లి
ఐజా మున్సిపాలిటీలో ఇండియన్ ఫార్వార్డ్ బ్లాక్ గెలుచుకొంది. మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలోని రెబల్స్ ఇక్కడ పోటీ చేసి గెలుపొందారు. ఇటు కొల్లాపూర్లో కూడా జూపల్లి అనుచరులు విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఇదివరకు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన కొడంగల్లో మాత్రం టీఆర్ఎస్ విజయం సాధించింది. ఇక్కడ గులాబీ గుబాళించడం కాంగ్రెస్ పార్టీని ఇబ్బందికి గురిచేసింది.