గిరిజనులకు కేసీఆర్ ఆ హామీ ఇవ్వగలరా.?సాగర్ సభలో సీఎం ఎలాంటి భరోసా ఇస్తారన్న బండి సంజయ్.!
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బుదవారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ పర్యటనకు వెళ్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ కొన్ని అంశాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ముఖ్యంగా గిరిజనులు, లంబాడీలు ఎక్కువ సంఖ్యలో ఉన్న నాగార్జునసాగర్ నియోజకవర్గ పర్యటనకు ముందు తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల హక్కులను కాలరాస్తున్న తెలంగాణ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని బీజేపి తెలంగాణ అద్యక్షుడు బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేసారు.
గిరిజనుల హక్కులను కాల రాస్తున్న టీ సర్కార్.. మండిపడ్డ బండి సంజయ్..
తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు చెందిన వేల ఎకరాల భూమిని బడా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు అక్రమంగా ఆక్రమించుకొని ప్రశ్నించిన గిరిజనులను పోలీసులతో కేసులు బనాయించడం, జైళ్లకు పంపించడం జరుగుతున్న నేపథ్యంలో చంద్రశేఖర్ రావు నాగార్జునసాగర్ పర్యటన సందర్భంగా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని గుర్రంబోడు తండాలో ఆక్రమించుకున్న భూమిపై గిరిజనులకు స్పష్టత ఇవ్వాలని బండి సంజయ్ నిలదీసారు.
సీఎం సాగర్ వచ్చే ముందే గిరిజనులకు క్షమాపణలు చెప్పాలి.. డిమాండ్ చేసిన బండి సంజయ్..
కాగా తెలంగాణ రాష్ట్రంలో పేద గిరిజనులకు కేటాయించిన అసైన్డ్ భూములను కూడా ప్రభుత్వం సొంత కార్యక్రమాల కోసం సేకరిస్తూ వారికి పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించడం లేదని, ముఖ్యంగా హరితహారం ప్రాజెక్టులో గిరిజనులు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూముల్లో మొక్కలు నాటే పేరుతో నిర్వాసితులను చేసి, ప్రశ్నించిన వారిని పోలీసులతో లాఠీచార్జ్ చేయించడం, కేసులు పెట్టి జైళ్లో పెట్టడం, వాస్తవం కాదా..? ముఖ్యమంత్రి స్పష్టం చేయాలని బండి సంజయ్ సవాల్ విసిరారు.
గిరిజనుల అసైన్డ్ భూముల ఆక్రమణలు.. ప్రభుత్వ అండతోనే జరుగుతున్నాయన్న సంజయ్..
ఇదిలా ఉండగా నాగార్జునసాగర్ పక్కనే ఉన్న దేవరకొండ నియోజకవర్గంలోని చందంపేట మండలంలో గిరిజన భూములను హరితహారం పేరుమీద ఆక్రమించుకున్న విషయం ఈ సందర్భంగా గుర్తుచేసారు. తెలంగాణ రాష్ట్రంలో హరితహారం పేరుతో గిరిజనుల అసైన్డ్ భూములను లాక్కొని వారిపై అక్రమ కేసులు బనాయించిన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ముందు గిరిజనులకు స్పష్టమైన హామీ ఇచ్చి నాగార్జున సాగర్ లో పర్యటించాలని బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేసారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం పోడు భూముల విధానంపై స్పష్టత ఇవ్వాలి.. సీఎంను సూటిగా ప్రశ్నించిన బీజేపి అద్యక్షుడు
అంతే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో పోడు భూములలో వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసీలను బలవంతంగా నిరాశ్రయులను చేస్తూ వారి ఆకలిని తీర్చుకునేందుకు ఆధారమైన తిండి గింజలను పండించుకోకుండా అడ్డుపడుతూ ప్రశ్నించిన ఆదివాసీలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, వారికి సీఎం ఎలాంటి భరోసా ఇస్తారో స్పష్టం చేయాలనన్నారు బండి సంజయ్. ఈ అంశంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం పోడు భూముల విధానాన్ని స్పష్టం చేయాలని బిజెపి డిమాండ్ చేస్తోంది. గతంలో అనేకసార్లు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పోడు భూములపై తమ ప్రభుత్వ విధానాన్ని ప్రకటిస్తానని దాటవేస్తున్న వైనాన్ని ఈ సందర్భంగా బండి సంజయ్ నిలదీసారు.