గౌరవం లేని చోట ఉండలేం..! తన దారిలోనే జూపల్లి అంటున్న సోమారపు..!!
హైదరాబాద్ : గులాబీ నేతల వాలకం చూస్తుంటే మరికొంత మంది ఆ పార్టీని వీడేందుకు సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ లో అవమానాలు ఎదురయ్యాయని, కనీస గౌరవం కూడా దక్కడం లేదని, అందుకే ఆ పార్టీకి గుడ్బై చెప్పానని రామగుండం మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ చెప్పడం తెలిసిందే..! ఆదివారం తన అనుచరులతో కలిసి ఆయన బీజేపీలో చేరారు.
ఆయనతోపాటు రామగుండం మునిసిపల్ కార్పొరేషన్కు చెందిన ఆరుగురు టీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కమలం గూటికి చేరారు. వారికి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తర్వాత బీజేపి నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఉద్యమ సమయంలో చంద్రశేఖర్ రావు, హరీశ్రావు ఆహ్వానించడంతో తెలంగాణ సాధన కోసం టీఆర్ఎస్ లో చేరానని, అహర్నిశలు టీఆర్ఎస్ అభివృద్ధి కోసం పనిచేశానని సోమారపు సత్యనారాయణ తెలిపారు.
తాను అడగకున్నా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పిలిచి ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చారని, అయితే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీలో స్వేచ్ఛ, కనీస గౌరవం కూడా కొరవడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన అనుచరులనూ అవమానించారని, పార్టీ సభ్యత్వం కూడా ఇవ్వలేదని తెలిపారు.
కేసీఆర్ రోజులు లెక్కపెట్టుకోవాల్సిందేనా..!
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును కూడా టీఆర్ఎస్ అవమానిస్తోందన్నారు. తను కూడా గులాబీ పార్టీని విడనాడే పరిస్థితులు తలెత్తాయని, రాబోవు రోజుల్లో టీఆర్ఎస్ పార్టీనుండి బీజేపికి వలసలు తీవ్ర స్థాయిలో ఉంటాయని సోమారపు చెప్పుకొచ్చారు. తన శేషజీవితాన్నంతా దేశానికి, బీజేపీ అభివృద్ధికే కేటాయిస్తానన్నారు.
పేదరిక నిర్మూలన ప్రధాని మోదీతోనే సాధ్యమవుతుందన్నారు. టీఆర్ఎస్ లో ఇప్పుడున్న నేతలకు పెద్ద వారిని గౌరవించే సంస్కారం లేదని, వారిని సరైన మార్గంలో నడిపించే వారు కూడా పార్టీలో లేరని సోమారపు సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేసారు.