హైదరాబాద్ లోనూ రాజధాని నిరసనలు: భోగి మంటల్లో రిపోర్టులేసి సేవ్ అమరావతి అంటూ
రాజధాని అమరావతి తరలింపుకు నిరసనగా అమరావతి గ్రామాల ప్రజలు ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు . రాజధాని అమరావతి ముద్దు మూడు రాజధానులు వద్దు అంటూ రాజధాని రైతులు, రాజధాని గ్రామాల ప్రజలు సంక్రాంతి పండుగ జరుపుకోకుండా నిరసనలు కొనసాగిస్తున్నారు.
వై ఎస్ పండుగలు కూడా చేసుకోకుండా తమను బాధకు గురి చేస్తున్నారని రాజధాని అమరావతి ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉధృతంగా పోరాటం సాగిస్తున్న రాజధాని ప్రజలకు మద్దతుగా హైదరాబాద్ లోని రాజధాని ప్రాంత ప్రజలు తమ సంఘీభావం తెలుపుతున్నారు.
ఈ సారి సంక్రాంతి పండుగ కూడా జరుపుకోకుండా రాజధాని కోసం పోరుబాట పట్టారు రాజధాని గ్రామాల ప్రజలు . నేడు భోగి రోజున కూడా అమరావతి గ్రామాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక నేడు రాజధాని అమరావతి సెగ హైదరాబాద్కు తాకింది. ఒకే రాష్ట్రం, ఒకే రాజధానిని కొనసాగించాలని హైదరాబాద్ జూబ్లీహిల్స్లో భోగి మంటలు వేశారు రాజధాని ప్రాంతానికి చెందిన సెటిలర్స్.
జీఎస్ రావు ,బొస్టన్ కమిటీ నివేదికలను భోగి మంటల్లో వేసి తమ నిరసన తెలియజేశారు. సేవ్ అమరావతి అంటూ నినాదాలు చేశారు. గ్రీన్ క్యాపిటల్గా రూపుదిద్దుకుంటున్న అమరావతిని కాపాడాలంటూ ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
మూడు రాజధానులు వద్దు.. ఒక రాజధాని ముద్దు అంటూ నినాదాలు చేశారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇక ఇప్పటికే ప్రవాసాంధ్రుల మద్దతు కూడా రాజధాని ప్రాంత ప్రజలకు లభించింది. ప్రతి ఒక్కరు ముక్త కంఠంతో సేవ్ అమరావతి అని నినదిస్తున్నారు.