నయవంచన : భూతవైద్యం చేయిస్తానని యువతిపై అత్యాచారం..
హైదరాబాద్ : ప్రపంచం ఎంత అభివృద్ధి చెందుతున్నా ఇంకా మూఢ నమ్మకాలు రాజ్యమేలుతూనే ఉన్నాయి. దెయ్యం పట్టిందని, గాలి సోకిందని, చేతబడులు, బాణామతులను జనం నమ్ముతూనే ఉన్నారు. వాటిని వదిలించుకునేందుకు భూత వైద్యుల్ని సంప్రదిస్తూ నిలువుదోపిడీకి, నయవంచనకు గురవుతూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటన హైదరాబాద్లో జరిగింది. భూతవైద్యం పేరుతో ఓ యువకుడు యువతిపై పలుమార్లు అత్యాచారం చేశారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితున్ని అరెస్ట్ చేశారు.
ప్రేమించి.. పెళ్లాడి.. చివరకు..
యువతిపై కన్నేసిన నిందితుడు
బోరబండ ప్రాంతానికి చెందిన దంపతులు కొంతకాలంగా ఆర్థిక, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటి పరిష్కారం కోసమంటూ మల్లేపల్లిలోని ఓ దర్గాకు వెళ్తూ అక్కడ ఉండే ఓ భూత వైద్యున్ని ఆశ్రయించారు. 20 రోజుల క్రితం 19ఏళ్ల కుమార్తెతో కలిసి ఆ దంపతులు దర్గాకు రాగా.. ఆ సమయంలో అక్కడే ఉన్న భూతవైద్యుడి కొడుకు సదరు యువతిపై కన్నేశాడు. కారు డ్రైవర్గా పనిచేస్తున్న అతను వారితో మాటలు కలిపి పరిచయం పెంచుకున్నాడు.
బీదర్ తీసుకెళ్లి అత్యాచారం
20 రోజుల క్రితం భూత వైద్యుడైన తన తండ్రి వద్దకు వచ్చిన యువతి తల్లిదండ్రులను నిందితుడు కలిశాడు. బీదర్లోని ఓ దర్గాకు వెళ్తే సమస్యలు తీరుతాయని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన భార్యభర్తలు కుమార్తెతో కలిసి అతని వెంట బీదర్కు వెళ్లి ఓ లాడ్జిలో బస చేశారు. యువతి తల్లిదండ్రులను దర్గా వద్ద వదలి వచ్చిన నిందితుడు లాడ్జి రూంలో ఒంటరిగా ఉన్న యువతిపై అత్యాచారం చేశాడు. విషయం ఎవరికైనా చెబితే నీ తల్లిదండ్రులు చనిపోతారని యువతిని భయపెట్టాడు. దీంతో ఆమె ఆ విషయం ఎవరితో చెప్పలేదు.
నిందితున్ని కాపాడే ప్రయత్నం
హైదరాబాద్ తిరిగొచ్చిన తర్వాత ఈ నెల 11న బోరబండలోని యువతి ఇంటికి వెళ్లిన నిందితుడు ఆమెను బెదిరించి మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు తన పెద్దమ్మతో కలిసి ఎస్సార్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్ 376కిద కేసు నమోదుచేసిన పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసి యువతిని మెడికల్ ఎగ్జామినేషన్, కౌన్సిలింగ్ కోసం భరోసా సెంటర్కు పంపారు. అయితే నిందితున్ని కాపాడేందుకు ఎస్సార్నగర్ ఠాణాలో ఎస్సైగా పనిచేసి ప్రస్తుతం మరో జిల్లా డీఐగా విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి పైరవీ చేస్తున్నట్లు సమాచారం.