నగరపాలక సంస్థపై కేసు.. గుంతలమయమైన రోడ్లు.. పట్టించుకున్న నాథుడు లేడు.. మొద్దు నిద్రలో యంత్రాంగం..!
హైదరాబాద్ : హైదరాబాద్ చరిత్ర మసకబారుతోంది. చిన్న వర్షం పడినా నగరం చిత్తడిగా మారి చికాకు తెప్పిస్తోంది. రోడ్లన్నీ గుంతలమయంగా మారి నగర ప్రయాణం నరకాన్ని తలపిస్తోంది. ఇక కాలనీల పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది. ఓ మోస్తరు మౌళిక సదుపాయాలు ఉన్న కాలనీలు కూడా మురికి వాడలుగా మారిపోయాయి. ఇంటింటికి నల్లా, సెంట్రల్ డ్రైనేజి పేరుతో కాలనీలో రోడ్లను తవ్వి వదిలేసారు. దాదాపు సంవత్సర కాలం గడుస్తున్నా ఇంతవరకు నల్లాలో నీళ్లు వచ్చిన దాఖలాలు లేవు, రోడ్డు మళ్లీ పునరుద్దరించిన సందర్బాలు లేవు.
నగరంలో రోడ్ల పరిస్ధతి దారుణం.. మురికి వాడలను తలపిస్తున్న కాలనీలు..
దీంతో రోడ్లు దారుణంగా మారిపోయి, చిన్న వర్షం పడ్డా కాలనీల్లో నడవలేని పరిస్థితులు దర్శనం ఇస్తున్నాయి. దీనికి తొడు రోడ్లమీద చెత్తను తొలగించాల్సిన మున్సిపల్ ఉద్యోగులు సెలవుల్లో ఉన్నారో, సమ్మెలో ఉన్నారో తెలియని పరిస్థితి. పేరుకుపోయి చెత్త చెదారంతో కాలనీ రోడ్లు దుర్ఘంధభరితంగా మారిపోయాయి. ఇంత జరుగుతున్నా నగర పాలక సంస్థ ఉద్యోగులు స్పందించిన సందర్బాలు కనిపించడంలేక నగర వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది.
మొద్దు నిద్రలో మున్సిపాలిటీ యంత్రాంగం.. లోపించిన పారిశుద్యం..
అప్రమత్తంగా ఉండాల్సిన మున్సిపల్ సిబ్బంది విధుల్లో ఉన్నారా లేదో తెలియని పరిస్దితులు తలెత్తాయి. వర్షం పడినా, చెట్లు విరిగి రోడ్లకు అడ్డంగా పడిపోయినా పట్టించుకున్న అధికారులు కనుచూపు మేరలో ఉండరనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి నగరంలోని కాలనీలు కూడా మురికి వాడలను తలపిస్తున్న పారిశుద్య సిబ్బంది చోద్యం చూస్తున్నట్టు తెలుస్తోంది. నగరంలోని కాలనీల్లో రోడ్లన్ని మద్యలో తవ్వడంతో వర్షం నీరు నిలిచి దోమలకు వృద్దికి న నిలయంగా మారుతున్నాయి. అయినప్పటికి పట్తించుకున్న నాధుడు లేడని నగర పౌరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పేరుగొప్ప ఊరు దిబ్బ.. మసకబారుతున్న నగర చరిత్ర..
ఇక భారీగా కురుస్తున్న వర్షాలకు గుంతలు పడ్డ రోడ్లను తాత్కాలిక మరమ్మత్తులు చేసే ప్రక్రియ గతంలో ఉండేది. ఇప్పుడు ఆ వ్యవస్ధ ఉందో లేదో కూడా తెలియని పరిస్ధితులు తలెత్తాయి. ప్రధాన రహదారుల్లోనే రోడ్లు దారుణంగా తయారయినా కూడా పట్టించుకున్న పరిస్థితులు లేవు. ద్విచక్ర వాహనంపై వెళుతున్న వారు ఏ గుంటలో పడతారో వారికే తిలియని దారుణ పరిస్థితులు తలెత్తాయి. తాజాగా పాత నగరంలో గుంతలో పడి కాళ్లు విరిగిపోయిన ఓ నగర వాసి మున్సిపల్ శాఖపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసాడు. దీంతో నగర రోడ్డ పరిస్థితులు ఎంత దారుణంగా తయారయ్యాయో అర్ధం చేసుకోవచ్చు.
గుంతలు పడ్డ రోడ్డు కారణంగా కాలు విరగ్గొట్టుకున్న యువకుడు.. నగరపాలక సంస్ధపై క్రిమినల్ కేసు..
హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లు గుంతలమయంగా మారిపోయాయి. దీంతో ఓ యువకుడు బైక్ మీది నుంచి కిందపడడంతో కాలు విరిగింది. పాతబస్తీలోని డబీర్పురాకు చెందిన సయ్యద్ అజ్మత్ హుస్సేన్ జాఫ్రీ అనే యువకుడు బైక్ మీద వెళ్తూ, గుంతలో పడి కాలు విరగొట్టుకున్నాడు. దీంతో జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే తనకు ప్రమాదం జరిగిందని ఆరోపించిన జాఫ్రీ, నగరపాలక సంస్థపై డబీర్పుర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కాలు విరగడానికి జోనల్ కమిషనర్ బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశాడు. బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరాడు. కానీ డబీర్పురా పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైన కాసేపట్లోనే జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి ఆ గుంతను పూడ్చేశారు. అంటే కేసులు పెడితేనే సిబ్బంది విధులు నిర్వహిస్తారా అనే అభిప్రాయాలు వ్యక్తం సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.