సుశాంత్ సింగ్ డెత్ కేస్: సీబీఐ దర్యాప్తు: విచారణ దశలో: రాహుల్కు నో ఛాన్స్: కిషన్ రెడ్డి
హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ డెత్ కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కేసు విచారణ దశలో ఉన్నందున వివరాలను వెల్లడించలేమని అన్నారు. కేంద్రమంత్రిగా దానికి సంబంధించిన వివరాలను బహిర్గతం చేయలేమని చెప్పారు. ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు పూర్తయ్యేంత వరకూ తన అభిప్రాయాలు, అబ్జర్వేషన్ గురించి వెల్లడించడం సరికాదని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయ బిల్లులను రద్దు చేస్తామంటూ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు.
శివసేన సర్కార్ మెడకు సుశాంత్ సింగ్ డెత్ కేస్: తమ చుట్టూ ట్రాప్: సీబీఐని నమ్మలేం: రౌత్
పంజాబ్లో కొనసాగుతోన్న ఆందోళనల్లో దళారులు, ఏజెంట్లు మాత్రమే పాల్గొంటున్నారని, రైతులు ఎవరూ లేరని అన్నారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లుల వల్ల దళారులు కోట్లాది రూపాయల కమీషన్ను కోల్పోతారని, ఆ అక్కసుతోనే దీన్ని వ్యతిరేకిస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. వ్యవసాయ బిల్లుల వల్ల ఏ ఒక్క రైతు కూడా నష్టపోరని, వారి హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లబోదని అన్నారు. రైతులకు మేలు చేయడానికి, వారిని ఆర్థికంగా ఆదుకోవడానికి, దళారీ వ్యవస్థను రూపుమాపడానికే ఈ బిల్లులను తీసుకొచ్చామని అన్నారు.
వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఖేతీ బచావో యాత్రపై కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పోరాటం సాగించడానికి బదులుగా.. వ్యవసాయ మార్కెట్లలో పనిచేసే కమీషన్ ఏజెంట్లు, దళారుల కోసం కష్టపడుతోందని ఆరోపించారు. ఈ మూడు బిల్లులు- రైతాంగానికి వ్యతిరేకం కాదని, రైతుల పేరు చెప్పుకొని లబ్ది పొందాలనుకునే రాజకీయ పార్టీలకు వ్యతిరేకమని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయ బిల్లులను రద్దు చేస్తామని రాహుల్ గాంధీ చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. ఆయన జీవితంలో ఆ పని చేయలేరని అన్నారు.
Recommended Video
వ్యవసాయ బిల్లులను రద్దు చేసే అవకాశాన్ని రైతులు ఆయనకు ఇవ్వబోరని చెప్పారు. ఈ బిల్లుల వల్ల తమకు కలిగే ప్రయోజనాలు ఏమిటో రైతులకు తెలుసునని అన్నారు. రైతుల కోసం కాంగ్రెస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. వందకు వంద రూపాయలు పేదల బ్యాంకు అకౌంట్లకు చేరాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తపిస్తున్నారని, దళారీ వ్యవస్థను రూపు మాపేలా వ్యవసాయ బిల్లులను తీసుకొచ్చారని అన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, కొన్ని ప్రాంతీయ పార్టీలు మాత్రమే వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్నాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.