థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పై ఊరట...! పాత వాహనాలకు వర్తించదా?
హైదరాబాద్ : కొత్త కారు కొంటే మూడేళ్లు, బైకులు కొంటే ఐదేళ్లు కచ్చితంగా థర్డ్ పార్టీ బీమా తీసుకోవాల్సిందే. సుప్రీంకోర్టు తెరపైకి తెచ్చిన ఈ నిబంధన వాహనదారుల జేబుకు భారంగా మారింది. ఈనేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు పాత వాహనాలకు సైతం మూడేళ్ల పాటు థర్డ్ పార్టీ బలవంతంగా అమలు చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. వీటిపై కేంద్రానికి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రోడ్డు రవాణా జాతీయ మంత్రిత్వ శాఖ స్పందించింది. సుప్రీంకోర్టు ఆదేశాలు కేవలం కొత్త వాహనాలకే వర్తిస్తాయని స్పష్టం చేస్తూ ఆయా రాష్ట్రాలకు లేఖలు రాసింది.
సుప్రీంకోర్టు తీర్పులోని అంశాలను ప్రస్తావించడమే గాకుండా వాటికి మరింత స్పష్టతనిస్తూ రాష్ట్రాలకు లేఖలు రాశారు కేంద్ర రోడ్డు రవాణా డిప్యూటీ కార్యదర్శి రమణ్ దీప్ చౌదరి. నిర్మాణ రంగ వాహనాలతో పాటు ట్రక్కులు, బస్సులు తదితర వాహనాలకు కొన్ని రాష్ట్రాలు థర్డ్ పార్టీ బీమాను తప్పనిసరి చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని.. అయితే అది సరికాదని పేర్కొన్నారు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల ప్రకారం న్యూ వెహికిల్స్ కు మాత్రమే థర్డ్ పార్టీ బీమాకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలు అమలవుతాయని స్పష్టం చేశారు.