యూటీగా హైదరాబాద్...!!? ఢిల్లీ సర్కిల్స్ లో జోరుగా చర్చ : బీజేపీ ఆలోచన ఇదే..సాధ్యమ్యేనా...!!
జమ్ము కాశ్మీర్ విభజన జోష్ లో ఉన్న బీజేపీ అధినాయకత్వం విపరీత ఆలోచనలు చేస్తోందా. ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో కొత్త చర్చ మొదలైంది. ఎంతో కాలంగా వినిపిస్తున్న దేశానికి రెండో రాజధాని..సుప్రీం కోర్టు బెంచ్ వంటివి సౌత్ లో ఏర్పాటు చేయనున్నారని ఈ చర్చ సారాంశం. ఇందు కోసం దక్షిణ భారతంలో హైదరాబాద్ సరైన వేదికగా భావిస్తున్నట్లు చెబుతున్నారు. భాగ్యనగరాన్ని దేశానికి రెండో రాజధానిగా చేస్తూ కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తారని..అక్కడే సుప్రీం బెంచ్ ఏర్పాటు చేస్తారంటూ ఢిల్లీలో జోరుగా ప్రచారం సాగుతోంది.
దీని ద్వారా దక్షిణ భారతంలోనూ మైలేజ్ వస్తుందని..ఇప్పటి వరకు బీజేపీ ఉత్తర భారత పార్టీ అని..దక్షిణ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసారనే ప్రచారానికి సమాధానంగా ఉంటుందని చెబుతున్నారు. ఇదే సమయంలో తెలంగాణలోనూ మైలేజ్ వస్తుందని వారి అంచనాలుగా కనిపిస్తున్నాయి. అయితే, అదే జరిగితే..ఆ ప్రతిపాదనే తెర మీదకు అధికారికంగా వస్తే మరోసారి కేసీఆర్ కు రాజకీయంగా నెత్తిన పాలు పోసినట్లే. అందుకే కొత్త ఆలోచనతో దీనిని అమలు చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అసలు ఈ ప్రచారంలో నిజమెంత..సాధ్యమయ్యే ఆలోచనేనా..వర్కవుట్ అవుతుందా...
కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్...!!?
ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో కొత్త చర్చ మొదలైంది. జమ్ము కాశ్మీర్ విభజన..దేశ వ్యాప్తంగా సానుకూల స్పందన తో ఇప్పుడు బీజేపీ అధినాయకత్వం కొత్త ఆలోచన చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు బీజేపీ ఉత్తరాది పార్టీ అనే ముద్ర చెరిపేసి దక్షిణ భారతంలో పట్టు నిలుపుకొనేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నట్లు ఈ ప్రచార సారాంశం. ఇందులో భాగంగా దక్షిణ భారతంలో ఒక అనుకూలమైన నగరాన్ని దేశానికి రెండో రాజధాని చేయాలని..అదే సమయంలో ఎంతో కాలంగా డిమాండ్ ఉన్న సుప్రీం కోర్టు బెంచ్ ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందుకు అనువైన నగరంగా హైదరాబాద్ వైపు బీజేపీ నేతలు చూస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. 2024 వరకు ఏపీ ..తెలంగాణ ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయటం ద్వారా అటు తెలంగాణలోనూ.. ఇటు తాము హైదరాబాద్ కోల్పోయామనే భావనలో ఉన్న ఏపీ ప్రజల్లోనూ సానుకూలత వస్తుందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో మొత్తంగా దక్షిణ భారతంలో పార్టీ పట్ల పాజిటివ్ కోణం ఏర్పుడుతుందని భావిస్తున్నారని చెబుతున్నారు. హైదరాబాద్ ను తెలంగాణ రాజధానిగా కొనసాగిస్తూనే..కేంద్రం పెత్తనం కొనసాగేలా గ్రేటర్ పరిధి వరకు కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా ఉన్నత స్థాయి వర్గాల్లో చర్చ సాగుతోందని..పొలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
రాజకీయంగా పట్టు సాధించేనా..సాధ్యమేనా..
నిజంగా ప్రచారం సాగుతున్నట్లుగా హైదరాబాద్ ను తెలంగాణ రాజధానిగా కొనసాగిస్తూనే..కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే ఆలోచన సాధ్యమయ్యే పనేనా అనేది ఇప్పుడు అసలు ప్రశ్న. రాజకీయంగా తెలంగాణ లో ఎలాగైనా పట్టు సాధించేందుకు అమిత్ షా పావులు కదుపుతున్నారు. తాజా ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు లోక్ సభ స్థానాలు గెలవటం ద్వారా బీజేపీ నేతల అంచనాలు మరింతగా పెరిగాయి. అందులో భాగంగా ఇతర పార్టీల నేతల వలసలను ప్రోత్సహిస్తున్నారు. హైదరాబాద్ ను తెలంగాణ అజమాయిషీ లేకుండా కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే దానిని కేసీఆర్ రాజకీయంగా అనుకూలంగా మలచు కొనే అవకాశం ఉంటుందని..దీంతో.. యధాతధంగా తెలంగాణ రాజధాని స్టేటస్ కొనసాగిస్తూనే..కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా దేశ నలు మూలల నుండి వచ్చి హైదరాబాద్ లో స్థిర పడిన ప్రజల మద్దతు ఖచ్చితంగా బీజేపీకి దక్కుతుందని..అక్కడ ఇప్పటి వరకు ఆధిపత్యం సాగిస్తున్న మజ్లిస్ పార్టీకి చెక్ పెట్టవచ్చన్నది వారి ఆలోచనగా కనిపిస్తోంది. అయితే, తెలంగాణ ఉద్యమ సమయంలో ఇదే ప్రతిపాదన వస్తే నాడు టీఆర్ యస్ తో పాటుగా కాంగ్రెస్ ఎంపీలు.. ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నిరసనకు దిగాయి. దీంతో..కేంద్రం నాడు ఆ ప్రతిపాదన రద్దు చేసుకుంది. తిరిగి ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న చోట ఈ ప్రతిపాదన చేయటం ద్వారా బీజేపీకి ఎంతో కొంత ఉన్న సానుకూలత పోగొట్టుకోవటం అనే అభిప్రాయయం సైతం వ్యక్తం అవుతోంది.
కేసీఆర్ .. మజ్లిస్ లక్ష్యంగానే అడుగులు
దక్షిణ భారతంలో బీజేపీకి కేవలం కర్నాటక మినహా మరెక్కడా పట్టు లేదు. ఇప్పుడిప్పుడే తెలంగాణలో బలపడే ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణలో టీడీపీ.. కాంగ్రెస్ పట్టు కోల్పోయాయి. దీంతో..అటు కేసీఆర్ .. ఇటు మజ్లిస్ పార్టీని దెబ్బ తీసేందుకు బీజేపీ అగ్ర నాయకత్వం వ్యూహాలు సిద్దం చేస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో కేసీఆర్ పాలనా పగ్గాలు చేపట్టి పదేళ్లు పూర్తవుతుంది. సహజంగానే కేసీఆర్ మీద ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. కాంగ్రెస్ కోలుకొనే పరిస్థితి లేదనేది బీజేపీ నేతల అంచనా. మజ్లిస్ భాగ్యనగరం వరకే పరిమితం. దీంతో...తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో కేసీఆర్ సెంటిమెంట్ ద్వారా తన పట్టు నిరూపించుకొనే ప్రయత్నం చేస్తారని..దీంతో ముందుగా గ్రేటర్ తో పాటుగా తమకు కలిసి వచ్చే జిల్లాల్లో పట్టు సాధిస్తే తెలంగాణలో అధికారం వస్తుందని బీజేపీ నేతల అంచనాగా చెబుతున్నారు. దీని కోసమే కేంద్ర పాలిత ప్రతిపాదనగా ప్రచారం జరుగుతోంది. అయితే, కేసీఆర్ మద్దతు దారులు మాత్రం నిజంగా కేంద్రం అటువంటి ప్రతిపాదన తెర మీదకు తెస్తే రాజకీయంగా కేసీఆర్ నెత్తిన పాలు పోసినట్లేనని చెబుతున్నారు. మరి..నిజంగా కేంద్రం ఈ ప్రతిపాదన ముందుకు తెస్తుందా..అమలు చేసే ధైర్యం చేస్తుందా అనేది కాలమే సమాధానం చెప్పాలి.