అరగంటలో ఆరు.. 24 గంటల్లో డజను.. రికార్డులు బ్రేక్ చేస్తున్న చైన్ స్నాచర్లు
హైదరాబాద్ : రాష్ట్రంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. అడ్డూ అదుపులేకుండా గొలుసులు లాగేస్తున్నారు. హైదరాబాద్ శివార్లలో పరిస్థితి మరీ దారుణం. బుధవారం నాడు అరగంటలో ఆరు గొలుసు దొంగతనాలు జరగడం గమనార్హం. అదలావుంటే గురువారం ఉదయం మరో నాలుగు గొలుసు దొంగతనాలు జరిగాయి. అటు నల్గొండలో కూడా చైన్ స్నాచింగ్ కేసు నమోదయింది. ఒక్కరోజు వ్యవధిలో డజను గొలుసు దొంగతనాలు జరిగినట్లుగా తెలుస్తోంది. దీంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
వరుస చోరీలు.. భయాందోళనలో మహిళలు
హైదరాబాద్ శివార్లు చైన్ దొంగలకు వరంలా మారుతున్నాయి. నిఘా లేని కారణంగా అడ్డగోలుగా రెచ్చిపోతున్నారు. బుధవారం నాడు అరగంటలో ఆరు గొలుసు దొంగతనాలు జరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మహిళలను టార్గెట్ చేస్తూ అందినకాడికి బంగారం దోచుకెళుతున్నారు. ముసుగులు ధరించి బైకుల మీద వచ్చి సులువుగా పనికానిచ్చేస్తున్నారు.
గురువారం ఉదయం ఎల్బీనగర్ జోన్ లో నాలుగు గొలుసు చోరీలు కలకలం రేపాయి. హయత్ నగర్, కుంట్లూరు, వనస్థలిపురం చైతన్యపురిలో వరుస దొంగతనాలు జనాల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. అటు నల్గొండలో మహిళ మెడలోంచి నాలుగు తులాల చైన్ లాక్కెళ్లారు స్నాచర్లు. మొత్తానికి ఒక్కరోజు వ్యవధిలోనే డజను గొలుసు దొంగతనాలు జరగడం గమనార్హం.
అదృష్టం: చైన్ స్నాచింగ్ లు చేస్తున్న సాఫ్ట్ వేర్ కంపెనీ యజమాని, అదే కారణం!
ఎల్బీనగర్ జోన్.. 5 నిమిషాల్లో రెండు
చైన్ దొంగతనాలతో బయటకు రావాలంటేనే జంకుతున్నారు మహిళలు. వరుస చోరీలతో తీవ్ర భయాందోళనలకు గురువుతున్నారు. ఎల్బీనగర్ జోన్ లోని హయత్ నగర్ లో గురువారం ఉదయం కేవలం 5 నిమిషాల వ్యవధిలో 2 గొలుసు దొంగతనాలు జరగడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు టెన్షన్ పడుతున్నారు. హయత్ నగర్ లో లక్ష్మమ్మ అనే మహిళ మెడలోంచి చైన్ లాక్కెళ్లారు స్నాచర్లు. అలాగే కుంట్లూరులోని ఓ దేవాలయం దగ్గర నిలబడ్డ మహిళ మెడలోంచి గొలుసు దొంగిలించారు.
నిఘా వైఫల్యమా? భద్రత లేదా?
హైదరాబాద్ శివార్లలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతుండంపై పోలీస్ శాఖపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిఘా వైఫల్యంతోనే దొంగలు రెచ్చిపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. వరుస దొంగతనాలు జరుగుతున్నా పోలీస్ శాఖకు చీమకుట్టినట్లైనా లేదని మండిపడుతున్నారు కొందరు. రోడ్లపై నడిచి వెళ్లాలంటేనే భయం పడుతోందని.. భద్రత కల్పించాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
కొన్ని సందర్భాల్లో సీసీ ఫుటేజ్ ఉన్నప్పటికీ దొంగల్ని పట్టుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదలావుంటే చైన్ స్నాచర్ల ఆట కట్టించడానికి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నామంటోంది పోలీస్ శాఖ. వరుసగా జరిగిన ఈ చైన్ స్నాచింగులకు సంబంధించి ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠా పనయి ఉండొచ్చని భావిస్తున్నారు.