ఓవైసీకి నారా లోకేశ్ వార్నింగ్ -ఎంఐఎంపై చంద్రబాబు నిప్పులు -గ్రేటర్లో టీడీపీ సీన్ ఇది
హోరాహోరీగా సాగుతోన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్లతోపాటు మరో జాతీయ పార్టీ తెలుగుదేశం సైతం తమ సత్తా చాటుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది. గతంలో కంటే ఎక్కువ స్థానాల్లో బరిలోకి దిగిన టీడీపీ.. 'హ్యాపీ హైదరాబాద్' నినాదంతో మేనిఫెస్టో విడుదల చేసి, జనంలోకి వెళ్లింది. అయితే, టీడీపీ జాతీయ నేతలెవరూ ఎన్నికల ప్రచారానికి రాకపోవడం శ్రేణులను నిరుత్సాహపరుస్తోంది. ఇప్పుడా లోటును పూడ్చుతూ, టీడీపీ చీఫ్ చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లు గ్రేటర్ ఎన్నికల సంబంధిత అంశాలపై గురువారం కీలక ప్రకటనలు చేశారు.
సర్జికల్ స్ట్రైక్ చేస్తామని.. స్పెషల్ ప్యాకేజీ ప్రకటించారు.. బీజేపీ మేనిఫెస్టోలో పాతబస్తీకి భారీగా
అక్బరుద్దీన్ అనుచితంపై..
హైదరాబాద్ నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భయానక స్థాయిలో వరద ఉప్పొంగిన నేపథ్యంలో.. ఈ ఎన్నికల్లో గెలిస్తే చెరువుల్లో వెలసిన అక్రమ నిర్మాణాలను కూల్చేస్తామని పార్టీలూ హామీలిచ్చాయి. అయితే, ఎంఐఎం మాత్రం.. ఆక్రమణలకు ప్రభుత్వానిదే బాధ్యత అని వాదిస్తోంది. చెరువులో కట్టిన నిర్మాణాలను కూల్చేస్తామని బెదిరిస్తున్న పాలకులు.. దమ్ముంటే హుస్సేన్సాగర్ చెరువు లోని మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, మాజీ సీఎం ఎన్టీఆర్ సమాధులను కూల్చివేయాలని మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సవాల్ చేశారు. ఆయన కామెంట్లు అనుచితంగా ఉన్నాయంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే..
తెలుగువారిని అవమానిస్తారా?
ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. జాతీయ రాజకీయాలకు వన్నె తెచ్చిన తెలుగు వ్యక్తులు ఎన్టీఆర్, పీవీ అని కొనియాడారు. రాజకీయ లబ్ధి కోసం మహనీయులను రచ్చకీడుస్తారా? అని ఎంఐఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో పేదల సంక్షేమానికి ఎన్టీఆర్ బాటలు వేశారని గుర్తుచేశారు. సంస్కరణలతో దేశ ఆర్థిక రంగాన్ని పీవీ పరుగులు పెట్టించారని ప్రశంసించారు. ఎన్టీఆర్, పీవీపై వ్యాఖ్యలు తెలుగు వారందరినీ అవమానించడమేనని చంద్రబాబు అన్నారు. మరోవైపు..
ఓవైసీకి నారా లోకేశ్ వార్నింగ్
పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చేయాలని డిమాండ్ చేసిన మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఓవైసీపై టీడీపీ నేత నారా లోకేశ్ నిప్పులు చెరిగారు. ఎన్టీఆర్, పీవీ సమాధులు కూలుస్తానని చెప్పడం ద్వారా అక్బరుద్దీన్ తన వ్యక్తిత్వాన్ని తానే కూల్చేసుకున్నారని ట్విట్టర్లో లోకేశ్ ఘాటుగా స్పందించారు. ‘‘గొప్ప వ్యక్తుల సమాధులు కూల్చే బదులు.. మీలో ఉన్న అహాన్ని కూలిస్తే మీకు ఓట్లేస్తున్న ప్రజలకు న్యాయం జరుగుతుంది''అని హితవుపలికారు. ఇదిలా ఉంటే,
టీడీపీ నినాదం: హ్యాపీ హైదరాబాద్
గత గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని, 91 డివిజన్లలో పోటీ చేసి, ఒకే చోట విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ.. ఈసారి మాత్రం ఒంటరిగానే 106 డవిజన్లలో బరిలోకి దిగింది. పెద్ద సంఖ్యలో యువత, బీసీలకు టికెట్లిచ్చారు. కొన్ని డివిజన్లను ఖాతాలోకి వేసుకోవడంతోపాటు ఇంకొన్ని చోట్ల గట్టి పోటీ ఇస్తామని తెలంగాణ తెలుగుదేశం చీఫ్ ఎల్.రమణ తెలిపారు. హ్యాపీ హైదరాబాద్ తమ నినాదంగా చెప్పిన టీడీపీ.. గ్రేటర్ ఎన్నికల్లో గెలిస్తే.. ప్రతి ఇంటికీ మంచినీటి సరఫరా, సిటీ అంతటా వైఫై, ఇంటికీ పైపులైన్ల ద్వారా వంటగ్యాస్ సరఫరా, ఉచిత పార్కింగ్, మొబైల్ ఆస్పత్రులు, డంప్యార్డు ఫ్రీ సిటీగా హైదరాబాద్, ఓల్డ్ సిటీకి స్పెషల్ ప్యాకేజీ తదితర కీలక హామీలు అమలు చేస్తామని తెలిపింది.