చాలా కాలం తర్వాత పార్టీ కార్యక్రమంలో భాగస్వామ్యం..!సోమవారం ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించనున్న బాబు.!
హైదరాబాద్ : సుమారు రెండు సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నగరంలో పర్యటించబోతున్నారు. 2019 ముందస్తు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు ఆ తర్వాత ఎలాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోలేదు. కోవిడ్ కారణంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న చంద్రబాబు స్వర్గీయ నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి సందర్బంగా తెలంగాణ నేతలతో కలిసి ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించబోతున్నారు. చాలా రోజుల తర్వాత చంద్రబాబు నగరంలో పర్యటించడం పట్ల టీడిపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఫోటోలు: దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం
సోమవారం స్వర్గీయ ఎన్టీఆర్ 25వ వర్దంతి..
రెండేళ్లుగా తెలంగాణ పార్టీ వ్యవహారాలకు దాదాపు దూరంగా ఉంటూ వస్తున్న అధినేత చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా పార్టీ శ్రేణులను ఆశ్చర్యానికి గురి చేయబోతున్నారు. ఇంతకాలం తెర వెనక ఉండి పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం చేసిన చంద్రబాబు సోమవారం తెలంగాణ నాయకత్వానికి ప్రత్యక్షంగా అందుబాటులోకి రాబోతున్నారు. చంద్రబాబు నగర పర్యటన పట్ల తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు యల్ రమణ పార్టీ శ్రేణులకు ఓ సందేశం పంపించారు. స్వర్వీయ ఎన్టీ రామారావు వర్ధంతి కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు యల్ రమణ.
చాలా కాలం తర్వాత సిటికి చంద్ర బాబు..
ఇక స్వర్గీయ ఎన్టీఆర్ వర్దంతి సందర్బంగా నిర్వహించే అమర జ్యోతి ర్యాలీ కార్యక్రమం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది. రసూల్ పురా లోని ఎన్టీఆర్ విగ్రహం నుండి ఎన్టీఆర్ ఘాట్ వరకూ ఈ అమర జ్యోతి ర్యాలీ అశేష పార్టీ కార్యకర్తల మద్య కొనసాగుతుంది. అప్పట్లో ఎన్టీఆర్ వీరాభిమాని శ్రీపతి రాజేశ్వర రావు ఈ ర్యాలీని నిర్వహించే వారు. ప్రస్తుతం ఆయన తనయుడు శ్రీపతి సతీష్ ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. ఈ అమరజ్యోతి ర్యాలీ కార్యక్రమానికి హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధిగా హాజరవ్వడం ఆనవాయితీగా వస్తోంది.
అప్రతిహతంగా అమరజ్యోతి ర్యాలీ..
అంతే కాకుండా స్వర్గీయ ఎన్టీఆర్ వర్దంతి సందర్బంగా ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో ప్రతి సవంత్సరం నిర్వహింస్తున్నట్టే ఈ ఏడాది కూడా రక్తదాన శిభిరాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పార్టీ అభిమానులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ రక్తదాన శిభిరంలో పాల్గొనడం, ఆతర్వాత వారికి ప్రశంసా పత్రం అందజేయడం జరుగుతుంది. కాగా స్వర్గీయ ఎన్టీఆర్ మరణించి సోమవారానికి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్బంగా ఆయన ఆదర్శాలను, జ్ఞాపకాలను నెమరు వేసకుంటూ అందరూ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని రాష్ట్ర నాయకత్వం పిలుపునిస్తోంది.
బాబుకు ఘన స్వాగతం..
ఇదిలా ఉండగా సుధీర్ఘకాలం తర్వాత హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ కు వస్తున్న చంద్రబాబు నాయుడు ప్రసంగంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా పార్టీ పటిష్టతకోసం చంద్రబాబు దిశా నిర్ధేశం చేస్తారా లేక నివాళి అర్పించి వెనుతిరుగుతారా అనే అంశం ఆసక్తికంరగా మారింది. వరుస ఓటములే కాకుండా పార్టీని వీడుతున్న నేతల తీరుతో తెలంగాణలో ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడిపోయింది తెలుగుదేశం పార్టీ. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఘోర పరాజాయాన్ని కూడగట్టుకుంది పార్టీ. ఈ సమయంలో ఎన్టీఆర్ ఘాట్ కు వస్తున్న చంద్ర బాబు పార్టీ శ్రేణులకు ఎలాంటి భరోసా ఇస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.