హైదరాబాద్ పర్యటనలో చేగువేరా కుమార్తె, మనవరాలు
హైదరాబాద్: విప్లవ యోధుడు కామ్రేడ్ చేగువేరా కుమార్తె అలైదా గువేరా, మనవరాలు ప్రొఫెసర్ ఎస్తేషానియా హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. పర్యటనలో భాగంగా హిమాయత్ నగర్లోని సీపీఐ రాష్ట్ర పార్టీ కార్యాలయం మఖ్దూం భవన్ను సందర్శించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, పలువురు సీపీఐ నాయకులు, పార్టీ అనుబంధ విద్యార్థి సంఘాలు, మహిళా నాయకులు వారికి ఘన స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం క్యూబా సంఘీభావ సభ నిర్వహించారు.
చేగువేరా కుమార్తె సీపీఐ రాష్ట్ర కార్యాలయానికి రావడం సంతోషంగా ఉందని కూనంనేని సాంబశివరావు అన్నారు. చే అనేది వారి ఇంటి పేరని.. అది ఇప్పుడు ప్రపంచాన్ని ఉత్తేజపరుస్తోందని చెప్పారు. మన భారతదేశంలో భగత్ సింగ్ ఎలాగో ప్రపంచానికి చే గువేరా అలాంటి గొప్ప వ్యక్తి అని తెలిపారు.
ఎప్పటికపైనా కమ్యూనిజం అజేయంగా నిలుస్తుందన్నారు కూనంనేని సాంబశివరావు. చేగువేరా కుమార్తె ఇక్కడికి రావడం అభినందనీయమని, ఉభయ కమ్యూనిస్టు పార్టీల సమన్వయంతో ఈ కార్యక్రమం జగరడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
అంతకుముందు కోల్కతా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న చేగువేరా కుమార్తె, మనవరాలికి ఘన స్వాగతం లభించింది. ఎయిర్ పోర్టుకు చేరుకున్న వీరికి అధికారులు, ప్రజాసంఘాల నాయకులు కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆహ్వానం పలికారు.
ఆదివారం సాయంత్రం 4 గంటలకు రవీంద్రభారతిలో జరిగిన 'క్యూబా సంఘీభావ సభలో అలైదా గువేరా, ఎస్తే ఫానియా ముఖ్యఅతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అలైదా గువేరా మాట్లాడుతూ.. చేగువేరాను టీషర్టులు, ఫొటోలకే పరిమతం చేయవద్దని.. ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.