టాలీవుడ్ యంగ్ హీరోపై చీటింగ్ కేసు... బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించిన బాధితులు
టాలీవుడ్ యంగ్ హీరో, కేరింత ఫేమ్ విశ్వంత్ దుద్దుంపూడిపై చీటింగ్ కేసు నమోదైంది. చౌక ధరలో కార్లు ఇప్పిస్తానని చెప్పి మోసం చేశాడన్న ఆరోపణలతో బంజారాహిల్స్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. విశ్వంత్తో పాటు మరో ఇద్దరి కేసు నమోదైనట్లు తెలుస్తోంది.
బాధితుల కథనం ప్రకారం.. హైదరాబాద్ శ్రీనగర్కాలనీకి చెందిన రామకృష్ణ అనే వ్యాపారి 2017లో సొంత కారు కొనాలనుకున్నాడు. ఈ క్రమంలో 30 శాతం తక్కువ ధరకు ఇన్నోవా కారు ఇప్పిస్తామని నటుడు విశ్వంత్, అతడి తండ్రి లక్ష్మీకుమార్ అలియాస్ సాయిబాబా రామకృష్ణను సంప్రదించారు.బంజారాహిల్స్లోని ఓ ఇంటీరియర్స్ షోరూం అధినేతతో తమకు సన్నిహిత సంబంధాలున్నాయని... ఆయన ద్వారా తక్కువ ధరకే కారు ఇప్పిస్తామని నమ్మబలికారు. దీంతో రామకృష్ణ వారికి రూ.10లక్షలు అడ్వాన్సుగా చెల్లించాడు.
ఆ తర్వాత మరో నెల రోజులకు రూ.2.50 లక్షలు చెల్లించాడు. అనంతరం ఇన్నోవా కారును రామకృష్ణకు అందించిన లక్ష్మీకుమార్.. ఆ వాహనాన్ని అతని పేరు మీదకు మార్చలేదు. ఆ కారుపై దాని పాత యజమాని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ నుంచి రూ.20లక్షలు అప్పు తీసుకుని చెల్లించలేదని రామకృష్ణ గుర్తించాడు. దీంతో కారును తీసుకుని తన డబ్బు తిరిగిచ్చేయాలని రామకృష్ణ విశ్వంత్,లక్ష్మీకుమార్లను కోరాడు. కానీ అటువైపు నుంచి ఎటువంటి స్పందన లేదు. పైగా అప్పటినుంచి ఇద్దరూ తప్పించుకుని తిరుగుతున్నారు. తక్కువ ధరకు కార్లు ఇప్పిస్తానని మరికొందరి నుంచి కూడా విశ్వంత్ డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో బాధితులు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని కోరారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
కాగా,ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన 'కేరింత' సినిమాలో విశ్వంత్ సెకండ్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. మలయాళ నటుడు మోహన్లాల్, గౌతమిలు నటించిన 'మనమంతా' సినిమాతో పాటు పలు వెబ్ సిరీస్లో కూడా నటించాడు. కాకినాడ సామర్లకోటకు చెందిన విశ్వంత్ ఉన్నత చదువులకు కోసం అమెరికా వెళ్లిన సమయంలో 2015లో 'కేరింత'లో నటించే అవకాశం వచ్చింది.