చెక్ బౌన్స్ కేసులో కోటి రూపాయల జరిమానా.. రెండేళ్ల జైలు శిక్ష
హైదరాబాద్ : చెక్బౌన్స్ కేసులో కోటి రూపాయల జరిమానా విధించింది న్యాయస్థానం. అప్పు తిరిగి చెల్లించడంలో విఫలమవడంతో మల్కాజిగిరి ఫస్ట్ సెషన్స్ కోర్టు ఇలా తీర్పునిచ్చిన ఘటన చర్చానీయాంశమైంది. అంతేకాదు రెండు సంవత్సరాల జైలు శిక్ష కూడా విధించింది.
సైనిక్పురిలో నివాసముండే గూడూరు సంజీవరెడ్డి.. సాకేత్ ఏరియాలో నివాసముండే మొగుల్ల విజయభాస్కర్ రెడ్డికి 55 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చారు. అయితే అప్పు తిరిగి ఇచ్చే విషయంలో ఇబ్బందులకు గురిచేశారు. ఆ క్రమంలో వత్తిడి తీసుకురాగా డెక్కన్ గ్రామీణ బ్యాంక్కు చెందిన రెండు చెక్కులు ఇచ్చారు. 25 లక్షల రూపాయలకు 2015 నవంబర్ 23వ తేదీతో, 30 లక్షల రూపాయలకు 2015 డిసెంబర్ 1వ తేదీతో ఇచ్చారు. సంజీవరెడ్డి వాటిని బ్యాంకులో డిపాజిట్ చేయగా అవి చెల్లుబాటు కాలేదు.
తెలంగాణ ఖజానాకు ఢోకా లేదు.. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి స్టేట్మెంట్
విజయభాస్కర్ రెడ్డి తనను ఛీట్ చేశారనే ఆరోపణలతో కోర్టును ఆశ్రయించారు సంజీవ రెడ్డి. పూర్తిస్థాయిలో విచారణ జరిపిన న్యాయమూర్తి సాంబశివ మంగళవారం తీర్పు వెల్లడించారు. చెక్ బౌన్స్ ఆరోపణలు రుజువు కావడంతో విజయభాస్కర్ రెడ్డికి కోటి రూపాయల జరిమానాతో పాటు రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. బాధితుడు సంజీవరెడ్డికి అసలు 55 లక్షల రూపాయలతో పాటు మరో 20 లక్షల రూపాయలు నష్ట పరిహారం కింద చెల్లించాలని పేర్కొన్నారు.
ఒకవేళ జరిమానా చెల్లించకుంటే అదనంగా మరో ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఆదేశించారు. న్యాయమూర్తి తీర్పుతో పోలీసులు విజయభాస్కర్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు.