అమెరికాలోని చికాగోలో కాల్పులు: తెలుగు విద్యార్థి మృతి, మరొకరికి తీవ్రగాయాలు
హైదరాబాద్: అమెరికాలోని షికాగోలో తెలుగు విద్యార్థులపై నల్లజాతీయులు జరిపిన కాల్పుల్లో ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నగరానికి చెందిన నందపు దేవ్శిష్ అనే విద్యార్థి ఈ కాల్పుల్లో మరణించగా.. కొప్పాల సాయిచరణ్ అనే యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు.
విశాఖపట్నానికి చెందిన లక్ష్మణ్ అనే మరో యువకుడు కాల్పుల నుంచి తృటిలో తప్పించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన విద్యార్థి సాయిచరణ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై బాధితుల తల్లిదండ్రులకు వారి స్నేహితులు సమాచారం అందించారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన దేవ్ శిష్, సాయిచరణ్, లక్ష్మణ్లు పది రోజుల క్రితం ఉన్నత విద్య అభ్యసించేందుకు షికాగోకు వచ్చారు. అక్కడే ఓ గది అద్దెకు తీసుకుని ముగ్గురూ కలిసి ఉంటున్నారు. ఇంటర్నెట్ కనెక్షన్ కు అవసరమైన రూట్ కొనుగోలు చేసేందుకు ముగ్గురూ కలిసి సమీపంలోని వాల్మార్ట్ షాపింగ్ మాల్ వెళ్తుండగా.. వారిని కొందరు నల్లజాతీయులు వెంబడించారు. పెద్దగన్, తుపాకీలతో ఫోన్లు ఇవ్వాలని బెదిరించారు. దీంతో తెలుగు విద్యార్థులు వారి మొబైల్ ఫోన్లు కిందపెట్టేశారు. వాటిని అన్ లాక్ చేయడానికి పిన్ వివరాలు అడగ్గా ఇచ్చారు. ఆ తర్వాత వారి వద్దనున్న డబ్బులు కూడా ఇచ్చేశారు.
అయితే, విద్యార్థుల నుంచి మొత్తం దోచుకున్న నల్లజాతీయులైన దుండగులు.. వెళ్తూ వెళ్తూ విద్యార్థులపై కాల్పులు జరిపారు. దీంతో దేవ్ శిష్ ఛాతిలో కుడివైపు బుల్లెట్లు దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. సాయిచరణ్ కు ఊపిరితిత్తుల్లో గాయాలయ్యాయి. లక్ష్మణ్ మాత్రం తప్పించుకున్నాడు. కొంత స్పృహలో ఉన్న బాధితులు ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే, తీవ్రంగా గాయపడిన దేవ్ శిష్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. సాయిచరణ్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని వైద్యులు తెలిపారు.
కాగా, కాల్పుల సమాచారం తెలిసిన వెంటనే తానా ఫౌండేషన్ ట్రస్ట్రీ, షికాగో తానా బాధ్యతలు చూస్తున్న హేమ కానూరు బాధితులకు సంబంధించిన చికిత్స ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షించారు. అక్కడి పరిస్థితులపై భారత్లోని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు.