తెలంగాణ డాక్టర్ మృతికి నిరసనగా.. చిలుకూరి బాలాజీ ఆలయం మూసివేత, ‘మహా ప్రదక్షిణం’
హైదరాబాద్: శంషాబాద్లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి సామూహిక అత్యాచారం, హత్య ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే గాక దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తాము సురక్షితంగా బతకలేమా? అంటూ మహిళా లోకం నిలదీస్తోంది.
ఆలయం మూసివేత..
కాగా, ప్రియాంక రెడ్డి ఘటన నిరసనగా చిలుకూరి బాలాజీ ఆలయాన్ని 20 నిమిషాలపాటు మూసివేయడం గమనార్హం. శనివారం ఆ సమయంలో ఆలయాన్ని మూసివేసి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేశారు పూజారులు. దీంతో భక్తులందరూ ఆలయం వెలుపలే ఉండిపోయారు.
మహా ప్రదక్షిణం..
మహిళలు, యువతులు, బాలికల క్షేమం కోసం చిలుకూరి బాలాజీ ఆలయం బయటే భక్తులతోపాటు పూజారులు కూడా ఉండి మహా ప్రదక్షిణం నిర్వహించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని భగవంతుడిని ప్రార్థించారు.
అత్యంత దారుణంగా..
బుధవారం రాత్రి లారీ డ్రైవర్ తోపాటు క్లీనర్లు ప్రియాంక రెడ్డిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత ఆమె మృతి చెందడంతో షాద్నగర్ బ్రిడ్జి కింద ఆమె మృతదేహాన్ని పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆ తర్వాత అక్కడ్నుంచి పరారయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏ1 మహ్మద్ అలియాస్ ఆరిఫ్, లారీ డ్రైవర్, ఏ2 జొల్లు శివ, ఏ3 నవీన్, ఏ4గా చింతకుంట చెన్నకేశవులుకు మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నలుగురు నిందితులను షాద్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు.
భారీగా నిరసనలు
కాగా, షాద్ నగర్ పోలీస్ స్టేషన్ తోపాటు చర్లపల్లి జైలు వద్ద శనివారం భారీ ఎత్తున ప్రజలు చేరుకున్నారు. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జీ కూడా చేశారు. నిందితులను తక్షణమే ఉరితీయండి లేదంటే తమకు అప్పగించాలంటూ డిమాండ్ చేశారు. శనివారం రాత్రి వరకు కూడా చర్లపల్లి జైలు వద్ద నిరసనలు చేపట్టారు. చర్లపల్లి వద్ద కూడా స్వల్ప లాఠీ ఛార్జీ చేసి నిరసనకారులను పోలీసులు చెదరగొట్టారు.